యువతిని నిర్బంధించి రెండ్రోజులపాటు గ్యాంగ్రేప్: వీడియో తీసి..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మహిళలు, యువతులపై జరుగుతున్న ఆకృత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఓ యువతిని బంధించిన దుండగులు.. రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.
గుర్గావ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 16ఏళ్ల యువతిని కరణ్ సింగ్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి.. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోని ఓ ఫ్లాట్లో నిర్బంధించారు. ఆగస్టు 6, 7 తేదీల్లో రెండ్రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వీరితోపాటు మరో ఇద్దరు వారి స్నేహితులు మహేశ్, కాల కూడా అత్యాచారం చేశారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు.. ఈ అఘాయిత్యాన్ని వారి మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.
అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత యువతి బాద్షా పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పాల్రా గ్రామానికి చెందిన కరణ్ తనకు తెలుసునని, బస్టాండ్ నుంచి తనను అతని బైక్పై కల్కాజీ ఆలయానికి తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది.
ఆ తర్వాత తనకు మాయమాటలు చెప్పి సమీపంలోని ఫ్లాట్లోకి తీసుకెళ్లాడని చెప్పింది. ఆ తర్వాత అతనితోపాటు అతని ముగ్గురు స్నేహితులు కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ ఘాతుకాన్ని వీడియో తీసి.. ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతామని బెదిరింపులకు గురిచేశారని తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుల్లో ఎవరినీ కూడా అదుపులోకి తీసుకోలేదని, వారందరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.