వ్యసనంగా ఆన్లైన్ గేమ్: తల్లిదండ్రులతోపాటు సోదరినీ చంపేశాడు, ఏం తెలియనట్లుగా..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్య ఘటన మిస్టరీ వీడింది. కన్న కొడుకే తల్లిదండ్రులతోపాటు సోదరిని కూడా హత్య చేశారని తేలింది. అది కూడా తనను ఆన్లైన్ గేమ్ను ఆడుకోనివ్వడం లేదని కోపంతోనే ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.
కూతురుతోపాటు దంపతుల హత్య: కొడుకు పరిస్థితి విషమం
వ్యసనంగా ఆన్లైన్ గేమ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీలోని మెహ్రౌలీలో నిందితుడు సూరజ్ ఓ రూమ్ను రెంట్కు తీసుకున్నాడు. ఆయనతో పాటు 10 మంది ఫ్రెండ్స్ ఆ రూమ్లో ఉండేవారు. కాలేజీకి వెళ్లకుండా అదే రూమ్లో రోజూ గడిపేవారు. వాళ్లకు ఓ వాట్సప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో ఎప్పుడూ క్లాసులు బంక్ కొట్టడం, పార్టీలు చేసుకోవడంలాంటి విషయాలపైనే చర్చించేవారు. ఆ రూమ్లోనే ఆన్లైన్ గేమ్కు అడిక్ట్ అయ్యాడు సూరజ్. రోజూ అదే గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాడు. దీంతో చదువులో వెనకబడిపోయాడు.
మందలించినందుకు ప్రాణం తీయాలని..
ఇలా అవారాగా తిరుగుతున్న సూరజ్ను రెండుమూడు సార్లు తన తల్లిదండ్రులు మిథ్లేశ్ వర్మ(45), అతడి భార్య సియా వర్మ(40) మందలించారు. తన సోదరి నేహ(16) తను బయట ఏం చేసినా పేరెంట్స్కు చెబుతుండటం.. పేరెంట్స్ ప్రతి విషయంలో అడ్డుతగులుతుండటంతో వాళ్లను చంపేయాలని పథకం పన్నాడు సూరజ్. మంగళవారం రాత్రి తన ప్లాన్ను అమలు చేయాలనుకున్నాడు. ఆరోజు అంతా మామూలుగానే ఉన్నాడు. అర్ధరాత్రి వరకు ఫ్యామిలీతో గడిపాడు. ఫ్యామిలీ ఆల్బమ్ కూడా చూశాడు.
కనీస మానవత్వం లేకుండా...
అందరూ నిద్రకు ఉపక్రమించాక.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్ర లేచాడు. కిచెన్లోకి వెళ్లి కత్తి తీసుకున్నాడు. ముందుగా తండ్రిని కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్రరక్త స్రావం అయి అతడి తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. అలికిడికి లేచిన తల్లిని కూడా పొడిచాడు. దీంతో తల్లి అచేతనురాలైంది. వెంటనే సోదరి రూమ్కు వెళ్లి.. సోదరి కడుపులో పొడిచాడు. ఇంతలో తన కూతురును రక్షించుకుందామని అక్కడికి వచ్చిన తన తల్లిని మళ్లీ పొడిచి చంపాడు.
దొంగల పనేనంటూ నమ్మించే యత్నం..
అనంతరం ఇంటినంతా గందరగోళంగా చేశాడు. వస్తువులన్నింటినీ చిందరవందర చేశాడు. ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పడం కోసం ఈ ప్లాన్ వేశాడు. ముగ్గురు చనిపోయారని నిర్ధారించుకున్నాక కత్తిని తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా శుభ్రంగా కడిగి ఆ తర్వాత పొరుగింటి వాళ్లకు సమాచారం అందించాడు. అంతేగాక, తనకు కూడా గాయం చేసుకున్నాడు. దొంగలు వచ్చి పేరెంట్స్ను, సోదరిని చంపారని నమ్మబలికాడు.
అంత్యక్రియలకు వెళ్లలేదు కానీ.. శిక్ష తగ్గించామన్నాడు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తుండగా... సూరజ్పై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన మిథ్లేశ్ వర్మ(45), అతడి భార్య సియా వర్మ(40), వాళ్ల కూతురు నేహ(16) అంత్యక్రియలను మిథ్లేశ్ సోదరుడు, ఇతర బంధువులే నిర్వహించారు. తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా వెళ్లని సూరజ్.. తనకు శిక్ష పడకుండా కాపాడాలంటూ పోలీసులను వేడుకోవడం గమనార్హం. సూరజ్ వ్యక్తిత్వాన్ని చూసి బంధువులు అసహ్యించుకున్నారు. సూరజ్.. ఇంత దారుణంగా ప్రవర్తించడంపై పోలీసులు కూడా షాకయ్యారు.