అక్కాచెళ్లెళ్లకు కానుక.. బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రక్షాబంధన్ స్పెషల్..!
ఢిల్లీ : అనుబంధాలకు, ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్. నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష అంటూ అన్నాదమ్ములు, అక్కాచెళ్లెల్ల మధ్య వెల్లివిరిసే బంధం. అన్నాదమ్ములకు రాఖీలు కట్టే అక్కాచెళ్లెల్లకు కానుకలు ఇస్తూ పరస్పరం ఆనందోత్సాహాల మధ్య జరిగే రక్షాబంధన్ సంబురం అంతా ఇంతా కాదు. ఎక్కడున్నా సరే.. ఎంతదూరంలో ఉన్నా సరే అక్కాచెళ్లెల్ల అప్యాయతను మనసారా అస్వాదించడానికి సొంత గ్రామాలకు వస్తుంటారు చాలామంది. రాఖీ పౌర్ణమిని వేడుకలా జరుపుకొంటూ ఆనందంగా గడుపుతారు.
ఆ క్రమంలో అక్కాచెళ్లెళ్లకు కానుక ప్రకటించింది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. రక్షాబంధన్ స్పెషల్గా బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. ఆగస్టు 15వ తేదీన గురువారం నాడు రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ రవాణా సంస్థ. మామూలు బస్సుల్లోనే కాదు ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఆ మేరకు డీటీసీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
కడుపులో ఇనుము.. 3.5 కిలోల 452 వస్తువులు.. ఎలా భరించాడో పాపం..!
ఢిల్లీ పరిధిలో నడిచే అన్నీ బస్సుల్లో రాఖీ పౌర్ణమి నాడు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు అధికారులు. మహిళలు ఎంత దూరం ప్రయాణించినా సరే ఆ ఒక్క రోజు మాత్రం ఛార్జీలు వసూలు చేయబోరన్నమాట. రక్షాబంధన్ పండుగను అతి ముఖ్యంగా మహిళలు భావిస్తుంటారు. అందుకే పండుగ రోజు మహిళలకు కానుక ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ నడిపే బస్సులతో పాటు మెట్రో రైళ్లలోనూ మహిళలకు శాశ్వతంగా ఫ్రీ జర్నీ అవకాశం కల్పించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే ప్రతిపాదించారు. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. కొందరు మహిళలు ఇతర రవాణా సాధనాలను ఎక్కువగా ఆశ్రయిస్తుండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే బస్సుల్లో, మెట్రోలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశముందనేది ఆయన వాదన. ఆ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు అధికారులు.