అడ్డంగా దొరికాడు: దేశంలోనే ఈ ట్రక్కు డ్రైవర్కు భారీ జరిమానా..ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: కొత్త మోటార్ వెహికల్ చట్టంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు విధించే జరిమానాలు కట్టలేక తమ వాహనాలను ఇంటివద్దే వదిలి రోడ్డుపైకొస్తున్నారు. ఇప్పటికే సరైన పత్రాలు లేకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వస్తున్నవారిపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ ట్రక్కు డ్రైవర్కు ట్రాఫిక్ పోలీసులు రూ.2 లక్షలు జరిమానా విధించారు. ఇప్పటి వరకు విధించిన జరిమానాల్లోకెల్లా ఇదే అత్యధిక జరిమానా కావడం విశేషం.
ట్రక్కు విషయానికొస్తే డ్రైవర్ లేదా యజమాని వద్ద సరైన పత్రాలు లేవు. అదే సమయంలో అది ఓవర్ లోడ్తో రోడ్డుపై వెళుతోంది. హర్యనా రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ఈ ట్రక్కుకు రవాణా శాఖకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ టీమ్ జీటీ కర్నాల్ రోడ్డు వద్ద నిలిపి భారీ జరిమానా విధించినట్లు ఢిల్లీ రవాణాశాఖా కార్యాలయం తెలిపింది. కొత్త మోటార్ వెహికల్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జరిమానాలు విధించడం ఇదే తొలిసారి. అంతకుముందు రాజస్థాన్కు చెందిన ట్రక్కు పై రవాణాశాఖా అధికారులు రూ.1.41 లక్షలు ఓవర్లోడింగ్కు జరిమానా విధించారు.
Delhi: A truck driver challaned Rs 2,00,500 for overloading, near Mukarba Chowk. pic.twitter.com/A4xk2uG1jK
— ANI (@ANI) September 12, 2019
ఇక ఢిల్లీలో పట్టుబడిన ట్రక్కు యజమానికి రూ.2,00,500 చలానా విధించారు. ట్రక్కుకు డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ టెస్టు, ఇన్ష్యూరెన్స్, పర్మిట్, సీటుబెల్టు ధరించకపోవడంతో ఈ స్థాయిలో భారీ జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. దీనికి అదనంగా రూ. 36వేలు విధించడం జరిగింది. పరిమితికంటే అదనంగా లోడ్ను ఈ ట్రక్కులో తీసుకెళుతున్నాడని అధికారులు చెప్పారు. పరిమితిలో ఉండాల్సినదానికంటే అధికంగా 18 టన్నులు తీసుకెళుతుండటంతో ప్రతి టన్నుకు జరిమానా విధించారు అధికారులు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1,31,000 విధించగా... ట్రక్ ఓనర్కు రూ.69,500 విధించడం జరిగింది. మొత్తానికి విధించిన జరిమానా మొత్తం రోహినీ కోర్టులో కట్టడం జరిగింది.