నవంబర్ 1 తర్వాత ఢిల్లీలో ప్రమాద స్థాయిలో కాలుష్యం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఇప్పటికే అక్కడి కాలుష్య పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇక నవంబర్ 1 తర్వాత విషవాయువులు గాల్లో కలిసే అవకాశం ఉందని సుప్రీం కోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య బోర్డు హెచ్చరిస్తోంది. ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ హర్యానాల నుంచి ఈ వాయువులు వస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యంతో నాణ్యత ప్రమాణాలు పతనమయ్యాయని గత రెండు రోజులుగా ఇవి మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయని పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ తెలిపింది. అంతేకాదు గురువారం ఢిల్లీలో ఉష్ణోగ్రత కూడా సాధారణ స్థాయికంటే రెండు డిగ్రీల సెల్సియస్ పడిపోయి 15 డిగ్రీల సెల్సియస్ నమోదైందని పేర్కొంది.
నవంబర్ 1నుంచి ఢిల్లీలో వాతావరణం మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చే గాలులు ఢిల్లీలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఢిల్లీ నగరం వాతావరణం పరంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించింది. పంజాబ్, హర్యానాలో పెద్ద ఎత్తున పంటలను అదే సమయంలో కాలుస్తారని ఇక్కడి నుంచి వెలువడే పొగ ఢిల్లీలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెప్పారు. ఇక దీపావళి వేడుకలు కూడా ఉండటంలో ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని చెప్పారు.
నవంబర్ 2016లో కూడా దీపావళి వేడుకలు తర్వాత ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది.అంతకు ముందు 17 ఏళ్ల వరకు ఎప్పుడూ ఆ స్థాయిలో కాలుష్యం ఢిల్లీ నగరాన్ని కమ్మేయలేదు. ఇక 2017లో దాదాపు ఒక వారం రోజుల పాటు ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరలు చాచడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. నవంబర్ 9, 2017లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 486ను తాకింది. ఆ సమయంలో అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
ఇదిలా ఉంటే దీపావళి రోజున తక్కువ శబ్దంతో కూడిన పటాకులను రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గాలులు అనుకూలంగా వీస్తే కొంత ఉపశమనం కలుగుతుందని లేదంటే ఢిల్లీ నగరం నవంబర్ 1 నుంచి మరో వారం రోజులపాటు కాలుష్యంతో అల్లాడిపోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.