మరో గంటలో పరీక్ష: వాట్సప్లో ప్రశ్నాపత్రం లీక్ చేశారు
న్యూఢిల్లీ: మరో గంటలో పరీక్ష ప్రారంభం కానుండగా ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం 3గంటలకు బి.కామ్ చివరి సంవత్సర పరీక్ష జరగాల్సి ఉంది.
కాగా, సరిగ్గా పరీక్ష మరో గంటలో ప్రారంభమవుతుందనగా.. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వాట్సాప్లో వచ్చిన ప్రశ్రాపత్రాన్ని పరిశీలించగా.. రెండు ప్రశ్నాపత్రాలు ఒకేలా ఉన్నాయి.
అయితే స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఛైర్మన్ దూబే మాత్రం ప్రశ్నాపత్రం లీకైందన్న వార్తలను తోసిపుచ్చారు. ఇది ఎవరో చేసిన తుంటరి పని అని కొట్టిపారేశారు.
లీకేజీ గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కళాశాలకు చెందిన ఇతర అధికారులు కూడా ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.