మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబా అరెస్ట్
న్యూఢిల్లీ: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జిఎన్ సాయిబాబా అరెస్టయ్యారు. మహారాష్ట్ర పోలీసులు ఆయనను న్యూఢిల్లీలో శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా కొనసాగుతున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిబాబా సిపిఐ మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
పోలీసులు సాయిబాబాను మహారాష్ట్రలోని గడ్చిరోలికి తరలించనున్నారు. సాయిబాబా పూర్తి పేరు గోకులకొండ నాగ సాయిబాబా. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం గ్రామానికి చెందినవారు.
గత జనవరిలో కూడా పోలీసులు సాయిబాబాను ప్రశ్నించారు. అతనికి చెందిన కంప్యూటర్ను సీజ్ చేశారు. మావోయిస్టు పార్టీకి సంబంధాలున్నాయనే అనుమానంతో ఆయనపై ఈ దాడులు నిర్వహించారు. కాగా, దాడుల అనంతరం సాయిబాబా మాట్లాడుతూ.. తన రాజకీయ కార్యకలాపాలు, అకాడమిక్ ఆసక్తులపై పోలీసులు పలు ప్రశ్నలు అడిగారని, వాటికి తాను సమాధానం చెప్పానని తెలిపారు.
ఇది ఇలా ఉండగా సాయిబాబాను భేషరతుగా విడుదల చేయాలని రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్(ఆర్డిఎఫ్) నేత వరవరరావు హైదరాబాద్లో డిమాండ్ చేశారు. ఆయనకు ఎలాంటి ముప్పు కలిగినా ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.