ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై రాష్ట్రపతి సస్పెన్షన్... నియామకాల వివాదం.. ఆధిపత్య పోరు...
ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వేటు వేశారు. త్యాగిని రాష్ట్రపతి సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం(అక్టోబర్ 28) వెల్లడించారు. వర్సిటీలో ఇటీవలి కీలక నియామకాలకు సంబంధించి వీసీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విద్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీనిపై విచారణకు అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు లేఖ రాసిన నేపథ్యంలో వీసీ సస్పెన్షన్కు గురయ్యారు.
విచారణ పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్
వీసీ సస్పెన్షన్కు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు లేఖ రాసింది. వీసీ యోగేష్ త్యాగిపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యేంతవరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుందని అందులో పేర్కొంది. త్యాగి విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. యూనివర్సిటీ తాత్కాలిక వైస్ ఛాన్సలర్గా పీసీ జోషీ బాధ్యతలు చేపడుతారని తెలిపింది.
నియామకాలపై తలెత్తిన వివాదం...
వీసీ యోగేష్ త్యాగి జులై 2న అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ప్రభుత్వం పీసీ జోషికి జులై 17న ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. యోగేష్ త్యాగి తిరిగి విధుల్లో చేరేంతవరకు ఆయన ఇన్చార్జిగా కొనసాగుతారని పేర్కొంది. ఇదే క్రమంలో గత వారం వీసీ యోగేష్ త్యాగి.. ఇన్చార్జిగా పీసీ జోషిని తప్పించి ఆయన స్థానంలో నాన్-కాలేజియేట్ విమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు యూనివర్సిటీ డైరెక్టర్ గీతా భట్ను నియమించారు.అదే సమయంలో గత బుధవారం పీసీ జోషి కొత్త రిజిస్ట్రార్గా వికాస్ గుప్తా నియామకాన్ని నోటిఫై చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఆయన నియామకాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు వీసీ యోగేష్ త్యాగి యాక్టింగ్ రిజిస్ట్రార్గా పీసీ ఝా నియామకాన్ని నోటిఫై చేశారు.
ఆ నియామకాలు చెల్లవని...
వీసీ తనను యాక్టింగ్ రిజిస్ట్రార్గా నోటిఫై చేశారని... యూనివర్సిటీ నియమ నిబంధనల మేరకే తన నియామకం జరిగిందని పీసీ ఝా విద్యా మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. వీసీ,ఇన్చార్జి వీసీ మధ్య నియామకాల విషయంలో తలెత్తిన వివాదాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి రాష్ట్రపతికి లేఖ రాసింది. యోగేష్ త్యాగి చేపట్టిన నియామకాలు చెల్లవని,ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని లేఖలో పేర్కొంది. ఆయనపై విచారణకు అనుమతినివ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వీసీ త్యాగిపై వేటు వేసి విచారణకు అనుమతినిచ్చారు.