ఫామ్లో 'థర్డ్ జండర్' కేటగిరి: లింగమార్పిడి విద్యార్ధులకు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశాలు..!
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ లింగమార్పిడి విద్యార్ధుల కోసం వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. యూనివర్సిటీలో క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ) పేరుతో 'ద థర్డ్ ఐ - డిగ్నిటీ ఆఫ్ బీయింగ్' అనే ప్రాజెక్టుని చేపట్టింది. ఈ ప్రాజక్టు ద్వారా లింగమార్పిడి చేయించుకున్న విద్యార్దులకు యూనివర్సిటీ ప్రవేశాలు కల్పించే భాగంగా చర్యలు చేపట్టింది.
ఈ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ కొత్త ప్రతిపాదనలతో విధివిధానాలను రూపొందించి ప్రవేశాల కమిటీకి అందజేయనుంది. కమిటీ ఆమోదించిన తర్వాత లింగమార్పిడి విద్యార్ధులకు ప్రవేశాలను కల్పించే విషయంలో స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
జూన్ నెల నుంచి ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశాలు మొదలవనున్న విషయం తెలిసిందే. లింగ మార్పిడి విద్యార్దుల రిజర్వేషన్, హాస్టల్ సదుపాయాలు వంటి వాటిపై చర్చిస్తున్నామని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ మదన్ మోహన్ చతుర్వేది తెలిపారు. గత ఏడాది సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశాల ఫారమ్లో 'థర్డ్ జండర్' కేటగిరిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
యూనివర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం గత ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 90,000 అప్లికేషన్స్ రాగా, అందులో తొమ్మిది మంది లింగ మార్పిడి విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించారు. దీంతో ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి అప్లికేషన్ ఫామ్లో 'థర్డ్ జండర్' కేటగిరిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.