Delhi violence: 2 ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు, ఇక కేసులన్నీ బదిలీ
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ క్రై బ్రాంచ్ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్ బృందాలకు బదిలీ చేయనున్నారు.
ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి డీసీపీ రాజేశ్ దేవ్, మరో దర్యాప్తు బృందానికి క్రైం బ్రాంచ్ అదనపు సీపీ బీకే సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులన్నింటినీ ఈ ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ అల్లర్లకు ఇప్పటి వరకూ 48 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, 130 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈశాన్యఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఆదివారం మొదలైన ఘర్షణ మంగళవారం రాత్రి వరకు కొనసాగిన విషయం తెలిసిందే.
ఆందోళనకారులు రాళ్లు విసరడం, ఇళ్లను తగలబెట్టడం, కాల్పులు జరపడంతో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉండటం గమనార్హం. దాదాపు 200 మందికిపైగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎవరినీ వదిలిపెట్టమన్న సీఎం కేజ్రీవాల్
అల్లర్లకు కారణమైన వారిని ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరైనా ఇందుకు కారణమైతే వారికి శిక్ష రెండింతలు ఉంటుందని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అల్లర్ల గాయపడిన క్షతగాత్రులకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులు కూడా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఏ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా వైద్య ఖర్చులు చెల్లిస్తామని అన్నారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇంటెలీజెన్స్ బ్యూర్(ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్యలో కీలక పాత్ర పోషించింది ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ అంటూ వస్తున్న ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. అల్లర్లకు కారణమైన వారిని ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందినవారు హింసకు కారణమైతే రెండింతల శిక్ష విధిస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.