ఢిల్లీ హింస : 42 మంది మృతి, మార్చురీ వద్ద బంధువుల పడిగాపులు
ఢిల్లీలో సీఏఏ కు నిరసనగా జరుగుతున్న పోరాట ఉద్రిక్తంగా మారింది. హింస చెలరేగింది. ఢిల్లీ ఇప్పుడు రావణ కాష్టంలా కాలుతుంది. ఇంకా ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్లారలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో ఢిల్లీ వాసులు ఉన్నారు. ఇక ఢిల్లీలో హింస చెలరేగినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 42 మంది మరణించారు. తమ వారి జాడ తెలీక, మృతదేహాల కోసం మృతుల బంధువులు మార్చురీల ముందు పడిగాపులు పడుతున్నారు. అంతులేని నిరీక్షణ చేస్తున్నారు. ఇక వారి ఆవేదన చూపరులను కంటతడి పెట్టిస్తుంది.
మార్చురీల వద్ద మృతుల బంధువుల నిరీక్షణ
ఢిల్లీ హింసలో మృతి చెందిన వారి మృతదేహాలను వివిధ ఆస్పత్రులలో భద్రపరిచారు. 38 మంది మృతదేహాలు జిటిబిలో, ముగ్గురు లోక్ నాయక్ ఆసుపత్రిలో, ఒకరి మృతదేహం జగ్ ప్రవీష్ చంద్ర ఆసుపత్రిలో ఉంది . జిటిబి ఆసుపత్రిలోని మార్చురీలో 15 మృతదేహాలు ఉన్నాయి అయితే వాటిలో తొమ్మిది మృతదేహాలను గుర్తించారు.మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఘర్షణల నుండి తప్పిపోయిన తమవారిని వెతుక్కుంటూ చాలా కుటుంబాలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇప్పటికీ జాడ తెలీక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న కుటుంబాలు
ఇక అలాంటి ఓ కుటుంబం తమ బాధను చెప్తూ ఫిరోజ్ అహ్మద్ (35) ఏళ్ళ వ్యక్తి ఢిల్లీ అల్లర్లలో గల్లంతు అయ్యాడు. అతని భార్య షహానా చివరిసారిగా సోమవారం రాత్రి 11 గంటలకు అతనితో మాట్లాడినట్టు చెప్తున్నారు. అతను ఏదో కొత్త నంబర్ నుండి కాల్ చేసి తనను తీవ్రంగా కొట్టారని మరియు కరావాల్ నగర్లో ఒక వ్యక్తి తనకు ఆశ్రయం ఇచ్చాడని చెప్పారని చెప్పింది. ఆ వ్యక్తి తనకు భోజనం పెట్టి ప్రథమ చికిత్స చేసినట్టు కూడా చెప్పారని ఆమె ప్ర్కొన్నారు.
ఢిల్లీలో ఇంకా పూర్తిగా అదుపులోకి రాని పరిస్థితులు
ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు తన భర్త జాడ తెలీలేదని,తన భర్త తనకు ఫోన్ చేసిన నంబర్ కు కాల్ చేస్తే అది మనుగడలో లేదని వస్తుందని షహానా కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలాంటి వారు ఎందరో దిక్కు తోచని స్థితిలో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని చెప్తున్నారు. అయితే పోలీసులు ఆ ప్రచారాలను ఖండిస్తున్నారు.
ద్వారకా మసీదుపై రాళ్ళ దాడి జరిగిందని ప్రచారం
ద్వారకా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరిగే క్రమంలో మతపరమైన నినాదాలు చేస్తూ మసీదుపై రాళ్ళ దాడికి యత్నించారని సెక్టార్ 11 లోని షాజహానాబాద్ మసీదు ఇమామ్, మొహద్ రషీద్ పేర్కొన్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జరిగిందని మసీదు వద్ద ఉన్న ముజ్జిన్ అయిన మన్నన్ రాళ్ళతో కొట్టిన శబ్దం విని చూడగా విరిగిన మసీదు కిటికీ తలుపు, లోపల రాళ్ళు ఉన్నాయని పేర్కొన్నారు.
మసీదు వద్ద రాళ్ళ దాడిని ఖండించిన పోలీసులు
అయితే, అలాంటి సంఘటన జరగలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.ఈ వార్తను వారు ఖండించారు. డిసిపి ద్వారకా ఇలా ట్వీట్ చేశారు: ద్వారకాలో మతపరమైన నినాదాలు చేస్తూ ఒక గుంపు ఒక మత ప్రదేశంలో రాళ్ళతో కొట్టారని చేస్తున్న పుకార్లు పూర్తిగా అబద్ధం అని పేర్కొన్నారు. సోషల్ మీడియా వార్తలను నమ్మొద్దని ఆయన చెప్పారు. ఏది ఏమైనా సీఏఏ అల్లర్లు మతపరమైన ఘర్షణలకు కారణం అవుతూ ఢిల్లీలో టెన్షన్ సృష్టిస్తున్నాయి.