ఢిల్లీలో పేట్రేగిన హింస.. కేంద్రం సంచలన నిర్ణయం.. సరిహద్దుల మూసివేత.. ఆర్మీ రంగప్రవేశం?
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస మంగళవారం కూడా కొనసాగుతున్నది. ఇప్పటిదాకా ఒక పోలీసుతోపాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లకు కేంద్రంగా ఉన్న ఈశాన్య ఢిల్లీలో సరిపడా పోలీసులు లేకపోవడంతో పారామిలటరీ బలగాలను మోహరింపజేశారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం కేజ్రీవాల్ వివరణ కూడా అందుకు మరింత బలం చేకూర్చుతోంది.
హైలెవల్ మీటింగ్ లో నిర్ణయాలు..
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ పర్యటిస్తున్న సమయంలోనే ఢిల్లీలో హింస చెలరేగడంతో కేంద్ర సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే సెక్యూరిటీని తగ్గించి, హింస జరిగేందుకు అవకాశం కల్పించారంటూ ప్రతిపక్షపార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల్ని కూడా మీటింగ్ కు ఆహ్వానించారు. గంటకుపైగా సాగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే..
ఆర్మీ మోహరింపు.. సరిహద్దులు ప్యాక్..
సీఏఏ వ్యతిరేక నిరసనల్ని వెంటనే ఆపకుంటే శిబిరాల్ని మేమే తొలగిస్తామంటూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనల వల్లే ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగిందని సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు వాదించగా.. రాజకీయాలకు ఇది సమయం కాదని, హింసను అదుపుచేసేందుకు బీజేపీతోపాటు అన్ని పార్టీలూ సహకరించాలని కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. ఇతర ప్రాంతాలకు హింస వ్యాపించకుండా ఈశాన్య ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేయడంతోపాటు ఆర్మీని కూడా రంగంలోకి దించాలనే ప్రతిపాదనపై మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. భేటీ తర్వాత..
కేజ్రీవాల్ కీలక ప్రకటన..
ఢిల్లీలో హింసపై అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్, అఖిల పక్షం నేతలతో భేటీ ముగిసన తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. హింసను అదుపు చేసేందుకు అవసరమైతే ఆర్మీని కూడా రంగంలోకి దించుతామని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు సీఎం తెలిపారు. సరిహద్దుల మూసివేత అంశంపైనా మాట్లాడామని, ఇప్పటివరకైతే అది ప్రతిపాదన స్థాయిలోనే ఉందని చెప్పారు. అల్లర్లలో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తామని అమిత్ షా మాటిచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు.
యధేచ్ఛగా కాల్పులు..
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు ముదిరి హింసకు దారితీసింది. నిరసనలు తెలిపే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ.. షాహీన్ బాగ్ తోపాటు ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రాలను ఖాళీ చేయిస్తామంటూ బీజేపీ, ఇతర హిందుత్వ సంస్థలు ప్రకటనలు చేయడం, వాళ్లలో నిరసనకారులు తలపడటం లాంటి పరిణామాలు పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి.
Recommended Video
హింస తీవ్ర స్థాయికి
శని, ఆదివారాల్లో ఈశాన్య ఢిల్లీలోని బ్రహ్మపురి, మౌజ్ పూర్, జఫ్రాబాద్, బాబర్ పూర్ సహా 10 చోట్ల చోట్ల వాహనాలు ధ్వంసంకాగా, సోమవారానికి హింస తీవ్ర స్థాయికి చేరింది. పెట్రోల్ బంకులు, ఇళ్లు, వాహనాలు కాలిబూడిదయ్యాయి. కొందరు యువకులు చేతుల్లో తుపాకులు పట్టుకుని యధేచ్ఛగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. మంగళవారం నాటికి మరిన్ని ప్రాంతాలకు హింస విస్తరించింది. ఇప్పటిదాకా ఒక హెడ్ కానిస్టేబుల్ తోపాటు ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. వీళ్లలో ఎక్కువమంది బుల్లెట్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.