ఢిల్లీ అల్లర్లు : 27కి చేరిన మృతుల సంఖ్య,రతన్ లాల్ అంత్యక్రియలకు పోటెత్తిన జనాలు
ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 27కి చేరింది. దాదాపు 200 పైచిలుకు మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్,ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ ఉన్నారు. రతన్ లాల్ అంత్యక్రియలను రాజస్తాన్లోని అతని స్వస్థలం తహవళిలో పోలీసుల లాంఛనాల నడుమ జరిపించారు. లాల్ అంత్యక్రియలకు జనం సముద్రంలా పోటెత్తారు. వేలాదిమంది అంతిమయాత్రలో పాల్గొని 'షాహీద్ రతన్ లాల్ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు.
Recommended Video
రతన్ లాల్ మృతదేహాన్ని బుధవారం ఉదయం తహవళికి తరలించారు. అతని మృతి గురించి తల్లికి తెలియజేయలేదు. అతని మృతదేహం ఇంటికి చేరగానే ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. రతన్ లాల్కి అమరవీరుడి హోదా ఇస్తామని సికర్ ఎంపీ సుమేధానంద్ ప్రకటించారు. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.1కోటి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. గ్రామస్తుల డిమాండ్ మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. అనంతరం భారత్ మాతాకీ జై నినాదాలతో రతన్ పార్థివదేహాన్ని స్మశానానికి తరలించారు.
ఏడేళ్ల రతన్ లాల్ కుమారుడు ఆయన చితికి నిప్పు పెడుతున్నప్పుడు చాలామంది కంటతడి పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితమే పెళ్లిరోజు జరుపుకున్న రతన్ లాల్.. హోలీ వేడుకలకు మళ్లీ ఇంటికి వస్తానని చెప్పి వెళ్లాడంటూ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 1998లో ఢిల్లీ పోలీస్గా చేరిన రతన్ లాల్.. గోకుల్పురి సబ్ డివిజన్లోని ఏసీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు.