ఢిల్లీ అల్లర్లపై సంచలన నిజాలు.. శనివారమే పసిగట్టిన ప్రజలు.. అయినా పట్టించుకోని పోలీసులు
దేశచరిత్రలో జరిగిన హేయమైన హింసాత్మక ఘటనల్లో ఒకటిగా భావిస్తోన్న ఢిల్లీ అల్లర్లకు సంబంధించి చేదు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మోదీ సర్కారు నేతృత్వలో పనిచేసే ఢిల్లీ పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే పరిస్థితి చేయిదాటిపోయిందన్న ఆరోపణలకు బలం చేకూర్చుతూ మరిన్ని రిపోర్టులు వెల్లడవుతున్నాయి. ఢిల్లీ హింసలో పోలీసుల వైఫల్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
ఈశాన్య ఢిల్లీలో హింస మొదలైనప్పటి నుంచి అంతా కాలిబూడిదైపోయే వరకు పోలీసుల సాయం కోసం ప్రజలు దీనంగా ఎదురుచూశారు. ఈనెల 23(శనివారం) నుంచి 26(బుధవారం) వరకు ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్(పీసీఆర్) కు ఏకంగా 15వేల ఫోన్ కాల్స్ వచ్చినట్లు మీడియా రిపోర్టులో వెల్లడైంది. అల్లర్లు ప్రారంభమైన శనివవారం నాడే సాయం కోసం 700 ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇన్ని వేల ఫోన్ కాల్స్ లో ఏ ఒక్కదానికీ పోలీసులు సరిగా రెస్పాండ్ కాకపోవడంతో హింస మరింత ప్రజ్వరిల్లింది.
ఈశాన్య ఢిల్లీలో శనివారం నుంచి బుధవారం దాకా చోటుచేసుకున్న అల్లర్లలో రెండు మతాలకు చెందిన 42 మంది హత్యకు గురికాగా, మరో 250 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 123 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. 630 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు శాఖ అధికారిక ప్రతినిధి మన్ దీప్ సింగ్ రంధావా ప్రకటించారు.
ఢిల్లీ అల్లర్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు ఢిల్లీ పోలీసులను తీవ్రంగా తప్పుపట్టాయి. ''కచ్చితంగా సమస్యంతా ఢిల్లీ పోలీసుల దగ్గరే ఉంది. ఒక్కరు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోలేదు. స్వతంత్ర నిర్ణయాలు అసలేలేవు. పక్కనే నిలబడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినవాళ్లను కూడా పోలీసులు పట్టుకోలేదు. అలాంటప్పుడు పరిస్థితి దిగజారకుండా ఉంటుందా?''అని సుప్రీం జడ్జి జస్టిస్ కౌల్ ప్రశ్నించగా, ''నిజమా? మీరు బీజేపీ నేతల రెచ్చగొట్టే వీడియోలు చూడలేదంటే మేం నమ్మాలా? మీ కమిషనరేట్ లో టీవీలు లేవా? కనీసం ఇంట్లో వార్తలు చూసేటప్పుడైనా అవి మీ దృష్టికి రాలేదా?''అంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ మురళీధర్ ఫైరైన సంగతి తెలిసిందే.