ఢిల్లీ అల్లర్లు : విధ్వంసానికి వాట్సాప్ గ్రూపుల్లో ఇలా కుట్ర జరిగింది.. షాకింగ్ నిజాలు
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఎంతటి ఆస్తి,ప్రాణ నష్టాన్ని మిగిల్చాయో అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 24,25,26 తేదీల్లో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకు 46 మంది మృతి చెందగా.. ఎంతోమంది ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్న సిట్ బృందాలు పలు కీలక ఆధారాలను సేకరించాయి. అల్లర్లు పథకం ప్రకారమే జరిగాయని గుర్తించిన సిట్.. అందుకోసం అల్లరి మూకలు వాట్సాప్ గ్రూప్లను ఉపయోగించినట్టుగా గుర్తించాయి.
వాట్సాప్ గ్రూపుల్లో పాత వీడియోలను సర్క్యులేట్ చేసి..
సీఏఏ వ్యతిరేక వర్గం,సీఏఏ మద్దతు వర్గం రెండూ అల్లర్లకు ముందు వాట్సాప్లో పలు గ్రూపులు క్రియేట్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ గ్రూపుల ద్వారానే రెచ్చగొట్టే వీడియోలు,ఆడియోలు పోస్టు చేశారని.. ప్రజలు రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చారని గుర్తించారు. ఎప్పుడో ఎక్కడో జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించిన పాత వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి.. ప్రస్తుతం ఢిల్లీ అల్లర్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అంటూ ప్రచారం చేశారని గుర్తించారు.
గతేడాది వీడియోను మళ్లీ..
పోలీసులు ఆ వాట్సాప్ గ్రూపుల్లో గుర్తించిన వీడియోల్లో.. నెయ్యి పెట్టెల నుంచి గన్స్ను బయటకు తీసే వీడియో ఉంది. ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు ఇలా ఆయుధాలు తీసుకొస్తున్నారని వాట్సాప్ గ్రూపుల్లో దాన్ని సర్య్యులేట్ చేశారు. కానీ పోలీసుల విచారణలో తేలిందేంటంటే.. అది చాలా పాత వీడియో. గతేడాది ఓ గ్యాంగ్ నెయ్యి పెట్టెల్లో అక్రమంగా ఆయుధాలను తరలిస్తుండగా ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు.. నెయ్యి పెట్టెల్లో నుంచి ఆయుధాలను బయటకు తీసి చూపించారు. ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టి తాజా ఘటనగా ప్రచారం చేశారు.
అంతా వాట్సాప్ గ్రూప్లోనే కమ్యూనికేషన్..
వాట్సాప్ గ్రూపులతోనే అల్లర్లకు పథకం రచించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎక్కడికి రావాలి... ఎక్కడ కలుసుకోవాలి.. ఎవరెవరి ఇళ్లు,దుకాణాలు ధ్వంసం చేయాలి.. వంటి సమాచారం అంతా వాట్సాప్ గ్రూపుల ద్వారానే షేర్ అయినట్టు గుర్తించారు. హింసాత్మక ఘటనల సమయంలో వారి ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఎక్కడ ఉందనే దానిపై విచారణ జరుపుతున్నామని.. తద్వారా అల్లర్లలో వారి ప్రమేయాన్ని గుర్తించే పనిలో ఉన్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. హత్యల్లో స్థానిక నేరస్తుల పాత్ర గురించి కూడా తమకు సమాచారం అందిందని.. దానిపై కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు.
10మంది అరెస్ట్.. విచారణ..
ఫిబ్రవరి 24న అల్లర్లతో సంబంధం ఉందన్న అనుమానంతో దయాల్పూర్ నుంచి 10 మందిని అరెస్ట్ చేశామని పోలీస్ అధికారి తెలిపారు. విచారణలో అది నిజమేనని తేలిందన్నారు. వీరంతా షేర్పూర్ చౌరస్తా వద్ద నిలబడి ఉన్న సమయంలో తమవాళ్లపై దాడులు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందని.. దీంతో రాళ్లు రువ్వడం మొదలుపెట్టారని అన్నారు. అలాగే చాలా దుకాణాలు,వాహనాలను ధ్వంసం చేశారని అన్నారు. కార్లను ధ్వంసం చేసే ముందు.. అది ఎవరిదో తెలుసుకునేందుకు.. దానిపై ఏమైనా పేరు ఉందా.. లేక ఏదైనా విగ్రహాలు,బొమ్మలు ఉన్నాయా అని పరిశీలించారన్నారు.
Recommended Video
దాదాపు 20-25గ్రూపులు..
మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే రోడ్లకు మీదకు రావాల్సిందేనని ఇరు వర్గాలు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు సర్క్యులేట్ చేసినట్టుగా గుర్తించారు. కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు పొరుగు ప్రాంతాలైన లోని,ఘజియాబాద్ల నుంచి ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి కొంతమంది కండలు తిరిగిన వ్యక్తులను రప్పించినట్టుగా గుర్తించారు. ఈ కండలు తిరిగిన వ్యక్తులంతా దాదాపు 20-25 గ్రూపులుగా విడిపోయారని.. ఒక్కో గ్రూపుకు స్థానికులైన మరో ముగ్గురు జతకూడారని గుర్తించారు. ఆ స్థానికులే ఎవరి షాప్స్,ఇళ్లను ధ్వంసం చేయాలో చెప్పారని పోలీసులు తెలిపారు. అల్లర్లపై విచారణ జరుపుతున్న సిట్ బృందాలు ఢిల్లీలోని మొత్తం 13 జిల్లాల నేరస్తుల జాబితాను తమకు అందించాలని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలిచ్చాయి. అల్లర్లలో వీరి ప్రమేయాన్ని విచారణలో తేల్చనున్నాయి.