ఢిల్లీ అలర్లు : జైశ్రీరామ్ కాదు.. ఇకనుంచి హర్హర్ మహదేవ్.. అక్కడ ఎందుకీ మార్పు?
దేశ రాజధాని ఢిల్లీలోని అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ ఒకటి. అల్లర్ల తర్వాత అక్కడి చాలామంది ముస్లింలు వేరే ప్రాంతాలకు తరలిపోయారు.అదే కాలనీలో ఉంటున్న హిందువులకు సైతం అల్లర్ల కారణంగా ఆదివారం నుంచి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడక్కడి కాలనీవాసులు రాత్రిపూట అల్లరి మూకలు కాలనీలోకి చొరబడకుండా గస్తీ కాస్తున్నారు. రాత్రి బోజనాలు ముగించుకున్న తర్వాత వీధిలోకి వచ్చి.. అంతా ఒక మంట దగ్గర గుమిగూడుతున్నారు. అనంతరం గస్తీకి దిగి.. ఉదయం వరకు కాలనీకి కాపలాగా ఉంటున్నారు. ఇదే క్రమంలో గురువారం రాత్రి కూడా సమావేశమైన కాలనీవాసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏంటా నిర్ణయం..
ఇకనుంచి రాత్రిపూట తమ కాలనీల్లో గస్తీ కాస్తున్న సమయంలో.. 'హర్ హర్ మహదేవ్.. వీర్ భజరంగీ' నినాదాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు శివ్ విహారీ కాలనీ వాసులు తెలిపారు. ఇటీవల తమ కాలనీల్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు జైశ్రీరామ్ నినాదాలతో విధ్వంసానికి పాల్పడ్డారని.. కాబట్టి వారికి భిన్నంగా ఉండేందుకు తమ నినాదాన్ని మార్చుకున్నామని చెప్పారు. తాము హర్ హర్ మహదేవ్ నినాదాలు చేస్తూ తమ కాలనీల్లో గస్తీ కాయడం ద్వారా.. ఇళ్లల్లోని మహిళలు,చిన్నారులు,వృద్దులు అభద్రతా భావానికి లోనుకారని చెబుతున్నారు.
మారుమోగుతోన్న హర్హర్ మహదేవ్..
అల్లర్లు జరిగినరోజు కొంతమంది అల్లరిమూకలు తమ కాలనీల్లోకి చొరబడి జైశ్రీరామ్ నినాదాలు చేశారని ఈస్ట్ కమల్ విహార్కి చెందిన అశుతోష్ ప్రకాశ్ రానా తెలిపారు. వారు కాలనీలోని ఇళ్లు,దుకాణాలను తగలబెట్టి పారిపోయారని అన్నారు. మతపరమైన నినాదాలు చేయడం ద్వారా ఎవరూ తమను అడ్డుకోలేరని వారు భావించారని.. కానీ వారు హింసను ప్రేరేపించడానికే అక్కడికి వచ్చారని తర్వాత అర్థమైందన్నారు రానా. అప్పటినుంచి తమ కాలనీలోని ప్రజలు జైశ్రీరామ్ నినాదాన్ని పక్కనపెట్టిన హర్ హర్ మహదేవ్ నినాదం చేస్తున్నట్టు చెప్పారు. శివ్ విహార్లోని ఆలయాల్లోనూ ఇప్పుడిదే నినాదం మారుమోగుతోందన్నారు.
స్థానికులు ఏమంటున్నారు..
గురువారం నాటికి దాదాపుగా అల్లర్లు సద్దుమణిగాయని భావించామని.. కానీ కొంతమంది యువకులు మళ్లీ అదే నినాదం చేస్తూ దుకాణాలను లూటీ చేశారని స్థానికులు చెప్పారు. 'గత వారం రోజుల నుంచి మేము పనికి కూడా వెళ్లట్లేదు. రాత్రిపూట గస్తీ కాస్తూ ఉదయం పూట కాసేపు పడుకుంటున్నాం. దీంతో నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందిపడాల్సి వస్తోంది.ఇప్పటికీ భయాందోళనలు తొలగిపోకపోవడంతో షాప్స్ తెరుచుకోలేదు.' అని స్థానికుడైన కైలేశ్ చంద్ర అనే వ్యక్తి తెలిపారు.
రాత్రిపూట కారంపొడి పట్టుకుని..
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో శివ్ విహార్ ప్రాంతం ఉంది. ఆ సరిహద్దు అవతలి నుంచి శివ్ విహార్లోకి చొరబడ్డ అల్లరిమూకలు హింసను ప్రేరేపించి పారిపోయారని కైలేశ్ చంద్ర చెప్పారు. అందులో చాలామంది ముఖాలకు హెల్మెట్లు,స్కార్ఫ్ కట్టుకున్నట్టు తెలిపారు. శివ్ విహార్లో అల్లర్ల తర్వాత చాలామంది ముస్లింలు అక్కడినుంచి వెళ్లిపోవడంతో.. వరుసగా ఉన్న ఆ ఇళ్లన్నింటికి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. ఉదయంపూట ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. రాత్రిపూట గస్తీ కాస్తున్న కాలనీవాసులు ఆత్మరక్షణ కోసం కారంపొడి ప్యాకెట్లను తమ వెంట పెట్టుకుంటున్నారు. కాలనీలోని మహిళలు గస్తీ సమయంలో వారికి టీ అందిస్తున్నారు.