ఢిల్లీ హింసలో జర్నలిస్టు దారుణ హత్య.. గంటగంటకూ పెరుగుతోన్న మరణాలు..
దేశరాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలు ఇంకా అదుపులోకి రాలేదు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ధ్వంసరచన యధేచ్ఛగా సాగుతోంది. ఇక్కడి మౌజ్పూర్ ప్రాంతంలో వార్తలు సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో పౌరుడు కూడా చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. పలు ఘటనల్లో సుమారు 40 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీలోని ఓ ప్రైవేటు చానెల్ కు చెందిన జర్నలిస్టు మంగళవారం మధ్యాహ్నం మౌజ్పూర్ ప్రాంతంలో వార్తల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తుతెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను సహచరులు గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆస్పత్రికి తరలించారు. గాయాలు లోతుగా కావడంతో చికిత్స అందిస్తుండగానే ఆ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. జర్నలిస్టు మృతిపై మీడియా సంస్థలు విచారం వ్యక్తం చేశాయి. మరోవైపు..
సీఏఏ నేపథ్యంలో ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఎంతకూ అదుపులోకి రాకపోవడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. హింస నియంత్రణ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో జరిగిన హైలెవల్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి గాంధీజీ సమాధి రాజ్ ఘాట్ ను సందర్శించారు. దేశరాజధానిలో శాంతి నెలకొనాలనే తాము గాంధీజీకి నివాళులు అర్పించినట్లు ఆయన చెప్పారు. అనంతరం జీటీబీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. హింసలో గాయపడ్డవాళ్లను పరామర్శించారు.
ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, సీలంపూర్, బ్రహ్మపురి, మౌజ్పూర్ తదితర ప్రాంతాల్లో హింస ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారంనాటి ఘటనల్లో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తోపాటు నలుగురు పౌరులు మరణించారు. మంగళవారం తాజాగా చలరేగిన అల్లర్లలో ఒక జర్నలిస్టుతోపాటు ముగ్గురు పౌరులు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8కి పెరిగింది. హింసాయుత ఘటనలన్నింటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.