ఢిల్లీ అల్లర్లు..హారర్ సినిమా: సిక్కుల ఊచకోత కంటే భయానకం: శివసేన
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దేశ రాజధానిలో ఆందోళనలను చేపట్టిన ప్రదర్శనకారులపై చోటు చేసుకుంటున్న దాడులు హారర్ సినిమాను తలపిస్తున్నాయని శివసేన వ్యాఖ్యానించింది. 1984 నాటి సిక్కుల ఊచకోత తరహాలోనే ఈ వరుస ఘటనలు కొనసాగుతున్నాయని పేర్కొంది. శివసేన మౌత్ పీస్గా భావించే సామ్నా పత్రిక ఢిల్లీ అల్లర్లపై బుధవారం ఎడిటోరియల్ను ప్రచురించింది.
భారత్ శాంతికాముక దేశమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీర్తించిన కొన్ని గంటల వ్యవధిలో ఏకంగా దేశ రాజధాని వీధుల్లో రక్తం ఏరులై పారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి మారణ కాండను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించింది. కత్తులు, రివాల్వర్లతో గుర్తు తెలియని వ్యక్తులు స్వైరవిహారం చేయడాన్ని 1984 నాటి సిక్కుల ఊచకోత తరువాత ఇప్పడే చూస్తున్నామని పేర్కొంది.
ఢిల్లీ గల్లీలను ఖాళీ చేయకపోతే తామే ఖాళీ చేయిస్తామంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ప్రకటనలను సామ్నా ప్రతిక తన ఎడిటోరియల్లో ఉంటంకించింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా పేరును ప్రస్తావించకుండా ఆయనపై నిప్పులు చెరిగింది. ప్రజలను రెచ్చగొట్టే ధోరణిని బీజేపీ నాయకులు గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఎందుకు మానుకోలేకపోతున్నారని నిలదీసింది.
ఢిల్లీలో చోటు చేసుకుంటున్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యతను వహించాల్సి ఉంటుందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది సామ్నా పత్రిక. అల్లర్లను ప్రోత్సహించేలా వ్యాఖ్యానించిన బీజేపీ నేతలపై ఎలాంటి చర్యలను తీసుకున్నారో.. తీసుకోబోతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. శాంతియుత వాతావరణాన్ని, సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది.