ఢిల్లీలో అల్లకల్లోలం.. ట్రంప్కు లింకుపెట్టిన మంత్రి కిషన్ రెడ్డి.. నడిరోడ్డుపై పోలీసు, పౌరుడి హత్య
గత కొద్ది గంటలుగా దేశ రాజధాని ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టడానికి ముందు సిటీ ఈశాన్య ప్రాంతంలో తీవ్ర హింస చలరేగింది. రెండు వర్గాలు రోడ్లపైకొచ్చి వీరంగం సృష్టించాయి. గొడవల్లో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్, మరో పౌరుడు దారుణ ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధానిలో చెలరేగిన హింసాకాండ.. ముమ్మాటికీ ట్రంప్ పర్యటన నేపథ్యంలో ప్లాన్ చేసిందేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మరో బాంబు పేల్చారు.
అసలేం జరిగిందంటే...
ఈశాన్య ఢిల్లీలోని భజన్పురా, మౌజ్పూర్, జాఫ్రాబాద్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలతో అట్టుడుకుతోంది. శని, ఆదివారాల్లోనూ ఇక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం జఫ్రాబాద్ లో సుమారు 1000 మంది మహిళలు ఒక్కసారే రోడ్డుపైకొచ్చి నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జి ప్రయోగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పెట్రోల్ బంకుతోపాటు పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పు పెట్టారు. గొడవల్లో రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. డీఎస్సీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కార్పుల్లో ఒక పౌరుడు మరణించాడు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస సిటీలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించే ప్రమాదం ఉండటంతో కేంద్రం.. అదనపు బలగాల మోహరింపునకు ఆదేశాలిచ్చింది. ఢిల్లీలో హింసపై సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలోనే అల్లర్లకు కుట్ర జరిగిందని, కొన్ని వర్గాలు కావాలనే హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన చెప్పారు. దీంతో అందరిలో గందరగోళం మరింత పెరిగింది.
ట్రంప్ హోటల్ వద్ద భద్రత పెంపు
సీఏఏ ఆందోళనలు, కానిస్టేబుల్ హత్య జరిగిన జఫ్రాబాద్ ప్రాంతానికి.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బసచేసిన మౌర్య హోటల్ ఉన్న చాణక్యపురి ఏరియాకు మధ్య దూరం సుమారు 18 కిలోమీటర్లు. ఇప్పటికే అదనపు బలగాలు మోహరించిన నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు హింస విస్తరించే అవకాశాలు చాలా తక్కువ. కానీ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో అమెరికా సెక్యూరిటీ బలగాలు అప్రమత్తమయ్యాయి. హోటల్ వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.
మోదీ పరువు తీయడానికే..
ట్రంప్ పర్యటన సందర్భంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించడం ద్వారా మోదీ సర్కారు పరువు తీయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుట్రలు పన్నారని, ఈశాన్య ఢిల్లీలో హింసకు వాళ్లే బాధ్యత వహించాలని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిరసన తెలిపే హక్కును దుర్వినియోగం చేస్తూ, అల్లర్లకు పాల్పడినవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు.
మెట్రో స్టేషన్ల మూసివేత..
ఢిల్లీలో పలు చోట్ల సీఏఏ నిరసనల్లో హింస చోటుచేసుకోవడంతో మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. జామియా వర్సిటీ నిరసనకారులు భారీ మార్చ్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, జనపథ్ మెట్రో స్టేషన్లను మూసేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.
రాహుల్ విచారం..
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగడంపై కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఎవరెంత రెచ్చగొట్టినా నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని సూచించారు. భజన్పురా, మౌజ్పూర్, జాఫ్రాబాద్ ప్రాంతాల్లో అల్లర్లు, కానిస్టేబుల్ హత్య ఘటనల్ని ఆయన ఖండించారు. హింసకు దారితీసిన పరిణామాలపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.