ఢిల్లీ అల్లర్లు: ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసపై విచారణ జరిపేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి. ఇప్పటి వరకు ఢిల్లీ అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులన్నీ ఈ దర్యాప్తు బృందాలు బదిలీ చేయపడతాయి.
Recommended Video
ఇది ఇలావుండగా, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అంకిత్ శర్మ మృతికి తాహిర్ హుస్సేన్దే బాధ్యత అంటూ శర్మ తండ్రి రవీందర్, బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలకు బలం చేకూరేలా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాహిర్ హుస్సేన్కు చెందిన భవనంపై నుంచి కొందరు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసురుతుండగా.. అతను కూడా అక్కడే తిరుగుతున్నట్లు ఆ వీడియోల్లో ఉంది. అంతేగాక, ఆ భవనంలో పలు బాటిళ్లు, రాళ్లు, కర్రలు లభ్యం కావడంతో ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. అయితే, అంకిత్ శర్మ మృతికి తాను కారణం కాదంటూ తాహిర్ హుస్సేన్ వివరణ ఇచ్చారు. కొందరు దుండగులు తన ఇంట్లోకి చొచ్చుకుని వచ్చారని, వారిని ఆపేందుకు తాను ప్రయత్నించానని, తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు.
ఐబీ అధికారి మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని అన్నారు. కాగా, తాహిర్ హుస్సేన్ ఇంటికి సమీపంలోనే అంకిత్ శర్మ మృతదేహం లభించడం గమనార్హం. తన కుమారుడిని కొందరు దుండుగులు లాక్కెళ్లారని, కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారని అంకిత్ శర్మ ఆరోపించారు.
ఎవరినీ వదిలిపెట్టమన్న సీఎం కేజ్రీవాల్
అల్లర్లకు కారణమైన వారిని ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరైనా ఇందుకు కారణమైతే వారికి శిక్ష రెండింతలు ఉంటుందని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అల్లర్ల గాయపడిన క్షతగాత్రులకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులు కూడా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఏ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా వైద్య ఖర్చులు చెల్లిస్తామని అన్నారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇంటెలీజెన్స్ బ్యూర్(ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్యలో కీలక పాత్ర పోషించింది ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ అంటూ వస్తున్న ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. అల్లర్లకు కారణమైన వారిని ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందినవారు హింసకు కారణమైతే రెండింతల శిక్ష విధిస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.