ఇథియోపియో విమాన ప్రమాదం: ప్రమాదానికి ముందు తండ్రితో చాలాసేపు మాట్లాడిన ఢిల్లీ యువతి
న్యూఢిల్లీ: ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు ఏపీకి చెందిన యువ డాక్టర్ ఉన్నారు. అలాగే, ఢిల్లీకి చెందిన శిఖా గార్గ్ అనే యువతి కూడా ఉన్నారు. ఈ విమానంలో తన కూతురు ప్రయాణించిందని ఆమె తండ్రి సతీష్ గార్గ్ తెలిపారు.
ఇథియోపియా విమాన ప్రమాదం, 157 మంది మృతి: '2 ని.లు' అతని ప్రాణాలు కాపాడింది
చాలాసేపు తండ్రితో ఫోన్లో మాట్లాడింది
రెండు రోజుల క్రితం అడీస్ అబాబా నుంచి నైరోబికి వెళ్తున్న విమానంలో శిఖా ప్రయాణించిందని ఆయన చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తరఫున ఆమె యూనైటెడ్ నేషన్స్ డెవెలప్మెంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. ఆడిస్ అబాబా నుంచి ఆ విమానం టేకాఫ్ కావడానికి ముందు తనతో ఫోన్లో చాలాసేపు మాట్లాడిందని తండ్రి చెప్పారు.
బాగానే మాట్లాడింది.. అంతలోనే
ఆడిస్ అబాబాలో విమానం మారుతూ తన కుమార్తె ఆదివారం ఉదయం పది గంటలకు ఫోన్ చేసిందని, అప్పుడు విమానం మారుతున్నట్లు చెప్పిందని, తనతో బాగానే మాట్లాడిందని, కాసేపటికే విమాన ప్రమాదం జరిగిందనే విషయం తమకు తెలిసిందని కన్నీటిపర్యంతమయ్యారు.
కూతురు గురించి సమాచారం కోసం ఎదురుచూపు
టీఈఆర్ఈ స్కూల్ ఆఫ్ అడ్వాన్డ్స్ స్టడీస్ నుంచి మాస్టర్స్ ఇన్ సైన్స్ పూర్తి చేసిన శిఖా ఢిల్లీ వర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఓ ఇంజినీరింగ్ సంస్థలో పని చేశారు. అనంతరం భారత వాతావరణ సంస్థలో సీనియర్ రీసెర్చర్గా పనిచేసి, అటు తర్వాత కేంద్ర పర్యావరణ, అటవీశాఖలో చేరారు. తమ కూతురి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని అందుకు విదేశీ వ్యవహారాల శాఖ నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉందన్నారు. కాగా, సోమవారం కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. శిఖా కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానని చెప్పారు.