మెట్రో నిర్లక్ష్యం : డోర్లో చిక్కుకున్న చీర.. ప్లాట్ఫాంపై మహిళను లాక్కెళ్లిన రైలు !
ఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. మోతీనగర్ మెట్రో స్టేషన్లో మెట్రో ట్రెయిన్ దిగుతున్న సమయంలో ఓ మహిళ ప్రమాదానికి గురైంది. స్టేషన్లో రైలు దిగుతున్న సందర్భంలో మహిళ చీర డోర్ మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. చీర ఇరుక్కొని పోవడం ఆ తర్వాత రైలు కదలడంతో మహిళను కొద్ది దూరం వరకు లాక్కెల్లింది. అయితే ఇది గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే ఎమర్జెన్సీ బటన్ నొక్కి డ్రైవర్ను అలర్ట్ చేయడంతో మహిళ తీవ్ర గాయాలతో బయటపడింది.
ప్రమాదంలో గాయపడిన మహిళ పేరు గీతా. ఆమె తన కూతురుతో కలిసి నవాడా నుంచి మోతీనగర్కు వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కారు. మోతీ నగర్ మెట్రో స్టేషన్ రాగానే ట్రెయిన్ నుంచి బయటకు వచ్చే సమయంలో డోర్ల మధ్య గీతా చీర చిక్కుకుపోయినట్లు తన భర్త తెలిపాడు. ప్రమాదంలో గీతా తలకు తీవ్రగాయాలైనట్లు ఆమె భర్త చెప్పారు. జరిగిన విషయాన్ని ఘటనా స్థలంలో ఉన్న తన కూతురు ఫోన్ చేసి చెప్పినట్లు గీతా భర్త చెప్పారు. తీవ్రగాయాలపాలైన గీతను చికిత్స కోసం దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు.
Blue Line Update
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) April 16, 2019
Delay in service from Moti Nagar to Rajendra Place.
Normal service on all other lines.
జరిగిన ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు. బ్లూలైన్లో ఈ ప్రమాదం జరిగినట్లు ధృవీకరించారు. ప్రమాదం జరగడంతో కొద్దిసేపు మెట్రోసేవలను నిలిపివేస్తున్నట్లు తమ అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. ఇదిలాఉంటే బాధితురాలు గీతా ఇంద్రలోక్ ప్రాంతంలో ఉండే శాస్త్రినగర్లో నివాసముంటోంది.