భర్తను నిర్బంధించి.. వివాహితపై ఇద్దరు సాధువులు గ్యాంగ్రేప్
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపాన నంగలీ గ్రామంలోని ఆశ్రమంలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆశ్రమంలో ఓ వివాహితపై ఇద్దరు సాధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఢిల్లీలోని దరియాగంజ్కు చెందిన ఒక ఇంజినీర్ తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం ఓ మతపరమైన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాడు. ఆశ్రమంలో తమ వెంట రావాల్సిందిగా ఇద్దరు సాధువులు కోరారనీ, బంతి భోజనాలు అయ్యాక తిరిగి వెళ్లేటప్పుడు వారు తన భర్తను నిర్బంధించి తనపై అత్యాచారం చేశారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ నిందితులని ఫెరూ(40), రాజు(22)గా గుర్తించారు. కాగా, నిందితులతో ఆశ్రమానికి ఎలాంటి సంబంధం లేదని, వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆశ్రమ ప్రధాన గురువు పింకీ మహారాజ్ తెలిపారు.
ప్రేమపెళ్లి చేసుకుందని.. చెల్లెల్ని పొడిచేశాడు
రాజ్కోట్ : తన చెల్లెలు తన ఇష్టానికి విరుద్ధంగా ప్రేమ పెళ్లి చేసుకుందని... ఆమెను పలుమార్లు కత్తితో పొడిచేశాడో దుర్మార్గపు అన్న. ఈ దారుణం గుజరాత్లోని రాజ్కోట్లో జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాపడిన తేజల్ రుతురాజ్ చౌహాన్ (21) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రాజ్ కోట్ నగరంలోని కలవాడ్ రోడ్డు ప్రాంతంలో గల క్రిస్టల్ మాల్లో ఆమె అన్న రాజేష్ కంగడ్ ఆమెను పలుమార్లు కత్తితో పొడిచినట్లు పోలీసుల విచారణలో తేలింది. రుతురాజ్ చౌహాన్ అనే వ్యక్తిని ప్రేమించిన తేజల్.. ఏడాది క్రితం అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఆమె అన్న రాజేష్కు ఇష్టం లేదు.
దీంతో అతడు సమయం చూసుకుని ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ప్రస్తుతం తేజల్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.