ఢిల్లీ జూ: ‘యువకుడ్ని చంపిన పులి తప్పేమీలేదు’
ఢిల్లీ: జంతు ప్రదర్శనశాల(జూ)లో 22ఏళ్ల యువకుడు మక్సూద్ను ఓ పెద్దపులి మెడ కొరికి చంపిన ఘటనలో పులి తప్పేమీ లేదని విచారణ జరిపిన అధికారులు తేల్చారు. ఢిల్లీ జూలో నిరుడు సెప్టెంబర్ 23న ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.
ఆ యువకుడు దుస్సాహసం చేసి పులి ఉండే ప్రదేశంలోకి దూకాడని, ఆపై దానిపై కొందరు రాళ్లు రువ్వి వేధించారని కేంద్రం నియమించిన విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాళ్లు రువ్వడంతోనే పులి అతడ్ని చంపేసిందని తెలిపింది. మక్సూద్ను కాపాడేందుకు చేపట్టిన చర్యల్లో ఎలాంటి లోపం లేదని తెలిపింది.
ఈ నివేదికను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్లతో కూడిన ధర్మాసనానికి అందించిన కమిటీ, ఈ తరహా చర్యలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది.
జూలో హెచ్చరిక బోర్డులు ఉన్నాయని, పులి జోన్ చూట్టూ కంచె వుందని, జూ అధికారుల తప్పూ లేదని, సెక్యూరిటీ హెచ్చరిస్తున్నా వినకుండా, పులి దగ్గరగా వెళ్లి ప్రమాదవశాత్తూ లోపలికి పడిపోయాడని తెలిపింది. దీన్నో దురదృష్టకర ఘటనగా వ్యాఖ్యానించిన కమిటీ, ఎవరి తప్పూ లేదని పేర్కొంది.
కాగా, ప్రభుత్వం, జూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త పులి బారిన పడి మృత్యువాత పడ్డాడని మృతుడి భార్య ఆరోపించింది. జూ అధికారులు భద్రతా పరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందిని చెప్పింది. కేంద్రం, జూ అధికారులు, ఢిల్లీ ప్రభుత్వం తనకు రూ. 50లక్షల పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది.