నిలుచోబెట్టి మహిళకు ప్రసవం ... గుజరాత్ లో అమానవీయ ఘటన
వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు దైవంతో సమానం. అటువంటి వైద్య వృత్తికి కళంకం తెచ్చారు గుజరాత్ రాష్ట్రంలోని వైద్యులు. ప్రసవవేదనతో ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళను కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించి నిల్చోబెట్టి ప్రసవం చేశారు అక్కడి వైద్య సిబ్బంది. అత్యంత హేయమైన ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఘటన
మాతృత్వం అనేది ఒక వరం. అలాంటి మాతృత్వం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళ చాలా అవమానకరమైన రీతిలో తన బిడ్డను ప్రసవించింది. డెలివరీ విషయంలో అత్యంత హేయంగా వ్యవహరించారు వైద్య సిబ్బంది. గుజరాత్ లో జరిగిందీ ఘటన. కాన్పు కోసం వచ్చిన మహిళను నిలుచోబెట్టి ప్రసవం చేశారు. నవమాసాలు మోసిన బిడ్డను కళ్లారా చూసుకోవాలని ఆశించిన ఆమెకు నరకం చూపించి మరీ కాన్పు చేశారు ఆసుపత్రి సిబ్బంది.
నిల్చోబెట్టే మహిళకు పురుడు పోసిన వైనం
గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో రామీ బెన్ అనే మహిళ నెలలు నిండడంతో కాన్పు కోసం తన అత్తగారితో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అయితే, అక్కడి నర్సు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి, రామీ బెన్ ను ఓ ఇనుప కడ్డీని పట్టుకోమని చెప్పి అక్కడికక్కడే పురుడు పోసింది. ప్రసూతి తాలూకు రక్తాన్ని కూడా రామీ బెన్ చీరతోనే తుడిపించి మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిపెట్టింది.
చిటికెన వేలుకి ఆపరేషన్ చేస్తే మరణించిన రోగి.. ఓ కార్పోరేట్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం
ఆస్పత్రుల్లో అమానవీయ ఘటనలు .. పీఎం సొంత రాష్ట్రంలో ఘటన
ఈ విషయం బయటకు తెలియటం తో సదరు వైద్య సిబ్బంది వ్యవహరించిన తీరు సర్వత్ర వివాదాస్పదంగా మారింది. గర్భిణీ మహిళ అని కూడా చూడకుండా నిల్చోబెట్టి డెలివరీ చేసిన ఉదంతం బయటకు రావడంతో రామీ బెన్ బంధుజనం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, తమ ఆసుపత్రిలో ఇలాంటి అమానవీయ ఘటనలు ఎప్పుడూ జరగలేదని ఓ సీనియర్ డాక్టర్ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇక స్థానిక ప్రజలు మాత్రం ఇక్కడ గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఏమైన ఘటనలు జరగకుండా, ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.