టెక్కీలకు ‘డెల్’ వార్నింగ్: అప్డేట్ అయితేనే ఉద్యోగంలో ఉంటారు!
టెక్ దిగ్గజం డెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఐఓ తమ సంస్థలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్: టెక్ దిగ్గజం డెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఐఓ బాస్క్ అయ్యర్ తమ సంస్థలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మారుతున్న టెక్నాలజీ పట్ల ఎవరికి వారే స్కిల్స్ను పెంపొందించుకోవాలని, లేదంటే కంపెనీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
తమ సంస్థలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులంతా కంపెనీ రెవెన్యూను పెంచే దిశగా సన్నద్ధం కావాలని ఆయన తెలిపారు. ఉద్యోగుల స్కిల్స్ ను ఏ ఆర్గనైజేషన్ పెంచలేదని... ఎందుకంటే ఉద్యోగులను ఎందులో ట్రైన్ చేయాలో కంపెనీలకు కూడా అవగాహన ఉండదని చెప్పారు.
భవిష్యత్తు అవసరాలను ఉద్యోగులే అంచనా వేసుకోవాలని... దానికి తగ్గట్టుగా ఎవరికి వారు అప్డేట్ కావాలని సూచించారు. కొత్త టెక్నాలజీలను ఉద్యోగులు అందిపుచ్చుకోవాలని అన్నారు. అలా ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోలేని ఉద్యోగులకు ఇక్కడ అవకాశం లేదని తేల్చి చెప్పారు.
నైపుణ్యం ఉన్న ఉద్యోగులే ఉన్నతస్థాయికి చేరుకోగలరని ఆయన తెలిపారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఐటీ కంపెనీల్లో పెను మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. కొత్తగా వచ్చే టెక్నాలజీకి అదనపు స్కిల్స్ చాలా అవసరమని తెలిపారు. భారత టెక్కీలు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం గల ఉద్యోగులే సంస్థలో దీర్ఘ కాలం పని చేయగలుగుతారని స్పష్టం చేశారు.