70 మంది ఉద్యోగులకు డెల్ ఇండియా ఉద్వాసన
బెంగుళూరు: బెంగుళూరులోని తమ సంస్థ నుంచి 70 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు డెల్ సాప్ట్వేర్ గ్రూప్ (డీసీజీ) గురువారం ప్రకటించింది. గడచిన తొమ్మిది నెలల కాలవ్యవధిలో ఈ ఉద్యోగులను తొలగించినట్లు డీసీజీ ప్రకటనలో పేర్కొంది.
భారత్లోని బెంగుళూరు, హైదరాబాద్ పట్టణాల్లో ఉన్న డెల్ సాప్ట్వేర్ గ్రూప్కు 110 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 70 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. గతంలో బెంగుళూరు యూనిట్లో 400 నుంచి 500 వరకు ఉద్యోగులు పనిచేసేవారు.
అయితే ఇటీవలే ఈఎంసీని డెల్ కంపెనీ కొనుగోలు చేసిన నేపథ్యంలో సంస్ధలో బోర్డు పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ నిర్ణయాల్లో భాగంగానే ఉద్యోగుల తొలగింపు వ్యూహాత్మక నిర్ణయమేనని డీఎస్జీ వెల్లడించింది. అయితే ఈ ఉద్యోగులు తొలగింపు హైదరాబాద్లోని డెల్ సంస్ధపై ప్రభావం ఉండదని పేర్కొంది.
కాగా, ఉద్యోగుల తొలగింపుపై డెల్ యాజమాన్యాన్ని మెయిల్లో సంప్రదించగా ఎలాంటి సమాధానం రాలేదు. డెల్ సంస్ధకు సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ను డెల్ సాప్ట్వేర్ గ్రూప్ డెవలప్ చేస్తుంది. సాఫ్ట్వేర్ సర్వీసులపై ఫోకస్ పెట్టిన తర్వాత దీనిని ఫిబ్రవరి 2012లో సృష్టించారు.