‘హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం.. దేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదు’
భారతదేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని అన్నారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని అన్నారు.
అంతేగాక, మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గితే.. జాతీయవాదం కూడా మరుగున పడే ప్రమాదముందని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సురక్షితంగా ఉందని, హిందువులు ఇంకా ఇక్కడ మెజారిటీ జనాభాగా ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.
లేదంటే ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సామరస్యం ప్రమాదంలో పడతాయని కేంద్రమంత్రి గిరిరాజ్ హెచ్చరించారు. దేశంలో సుమారు 54 జిల్లాల్లో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిందని, ప్రధానంగా ఉత్తరప్రదేశ్, అసోం, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని అన్నారు.
ముస్లింలు మెజారిటీ వర్గంగా అవతరిస్తే దేశసమగ్రత, ఐకమత్యానికి భంగం కలిగే అవకాశం ఉందని అన్నారు. కుటుంబ నియంత్రణ అనేది అందరికీ తప్పనిసరిగా వర్తింపజేయాలని అన్నారు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్లో హిందువుల సంఖ్య భారీగా తగ్గిపోగా.. మనదేశంలో మాత్రం ముస్లింల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.