రిహానా ట్వీట్ కంటే మోదీ తీరే డేంజర్ -నిరసనే ప్రజాస్వామ్యానికి జీవనాడి -రాజ్యసభలో సంచలన స్పీచ్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చట్టసభలోనూ దుమారం కొనసాగుతోంది. అగ్రి చట్టాలను ఉపసంహరించుకునే దాకా ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించగా, ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోన్న ప్రభుత్వం.. దీక్షా వేదికలను నిర్బంధించి, రోడ్డుకు అడ్డంగా మేకులు ఏర్పాటు చేసి, రైతుల శిబిరాలకు నీళ్లు, కరెంటు, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. రైతుల నిరసనలపై అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై భారత సర్కారు అతిగా స్పందించిందనే విమర్శలూ వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలపై ప్రతిపక్షాలు సర్కారును నిలదీశాయి..
మేకులు పీకలేదు -ప్లేస్ మార్చామన్న పోలీసులు -ప్రతిపక్ష నేతల అడ్డగింత -దుర్భేద్యంగా ఢిల్లీ సరిహద్దులు
రాజ్యసభలో సుదీర్ఘ చర్చ..
సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ కోసం ప్రభుత్వం, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగానే రైతుల ఆందోళనలపై చర్చించాలని నిర్ణయించారు. మొత్తం 15 గంటలపాటు చర్చించాలని నిర్ణయించగా, బుధ, గురువారాల్లో ప్రశ్నోత్తర సమయాన్ని, గురువారం శూన్య గంటను, శుక్రవారం జరగాల్సి ఉన్న ప్రైవేటు మెంబర్స్ బిజినెస్ ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఎత్తేశారు. సాగు చట్టాలపై రెండోరోజైన గురువారం ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా చర్చను ప్రారంభించారు. ఆయన చేసిన సంచలన ప్రసంగం నిమిషాల వ్యవధిలోనే వైరలైంది..
ట్వీట్లు కాదు భయపడాల్సింది దీనికే..
ఢిల్లీలో రైతుల నిరసనలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేతను రిపోర్టు చేస్తూ ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని షేర్ చేస్తూ ప్రముఖ పాప్ సింగర్ రిహానా(రియానా) చేసన ఓ ట్వీట్ ఉద్యమాన్ని మలుపుతిప్పింది. సోషల్ మీడియాలో 10కోట్లకుపైగా ఫాలోవర్లున్న రిహానా.. రైతుల ఉద్యమంపై చర్చిద్దామని ట్వీట్ చేసిన కాసేపటికే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కోడలు మీనా హ్యారిస్, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా సహా పలువురు అంత్జాతీయ సెలబ్రిటీలు వరుస ప్రకటనలు చేశారు. ఈ చర్యను గర్హిస్తూ భారత విదేశాంగ శాఖ అనూహ్య ప్రకటన చేసింది. రైతుల నిరసనలు భారత్ అంతర్గత వ్యవహారమని, విషయం తెలుసుకోకుండా ట్వీట్లు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ వెంటనే భారత్ సెలబ్రిటీలందరూ భుత్వానికి మద్దతుగా ట్వీట్లు చేశారు. ఈ విషయాలను రాజ్యసభలో ప్రస్తావించిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా.. ట్వీట్ల కంటే మనం భయపడాల్సింది ప్రభుత్వాల తీరుకే అని వ్యాఖ్యానించారు...
ఒక్క ట్వీటుతో కూలిపోతుందా?
''ప్రజాస్వామ్యానికి నిరసనలే జీవనాడి. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది కాబట్టే రైతులు ఆందోళనలకు దిగారు. గడిచిన రెండున్నర నెలలుగా 11 సార్లు రైతులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. కానీ వాటిని డైలాగ్ అనే కంటే మోనోలాగ్ అనడమే సరైందేమో. అవతలివాళ్లు ఏం చెబుతున్నారో కనీసం వినే ఓపిక కూడా మోదీ సర్కారుకు లేకుండా పోయింది. ప్రశ్నించిన వాళ్లందరినీ దేశద్రోహులుగా, టెర్రరిస్టులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్రలు వేసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి అతిగొప్పదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ కొందరి ట్వీట్ల కారణంగానో కూలిపోదు. ట్వీట్ల ద్వారా కంటే ప్రస్తుతం మోదీ సర్కారు అనుసరిస్తోన్న తీరు వల్లే ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రమాదం వాటిల్లుతుంది. అసలు..
రైతులు శత్రువులా? రోడ్ల మీద మేకులా?
బీజేపీ 303 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుందంటే కేవలం తాను పెంచి పోషిస్తోన్న గుప్పెడు కార్పోరేట్ అధిపతుల వల్ల కాదని, పేద రైతులు ఓటేస్తేనే గద్దెనెక్కామనే విషయాన్ని మోదీ సర్కారు మర్చిపోయింది. అందుకే రైతుల్ని శత్రువుల్లా చూస్తూ, వారు దీక్షలు చేస్తున్న ప్రాంతాలకు నీళ్లు, కరెంటు, ఇంటర్నెట్ సదుపాయాలను నిలిపేస్తోంది. ఇంత దారుణమా? మన రైతులు మనకు శత్రువులా? వాళ్ల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించాలా? ప్రభుత్వాలు వారధులు నిర్మించాలేగానీ విభజనలు, రోడ్లపై మేకుల్ని కాదు. దేశమంటే పోలీసులు, ఆర్మీ, జనగణమన, వందేమాతరం నినాదాలు కాదు.. మట్టితో మనుషులను కలిపి ఉంచేదే అసలైన దేశ నిర్మాణం. ఈ విషయంలో మోదీ సర్కారుది దారుణ వైఫల్యం'' అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
నల్లగా ఉన్నానని హేళన చేశారు -రంగు పూసి అందంగా -జయలలితే స్ఫూర్తి: వైసీపీ ఎమ్మెల్యే రోజా