Sakshi Maharaj: జామా మసీదును ధ్వంసం చేయండి..విగ్రహాలు లేకపోతే నన్ను ఉరి తీయండి: సాక్షి మహరాజ్
లక్నో: తరచూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లోకి ఎక్కే నాయకుడు సాక్షి మహరాజ్. మరోసారి ఆయన అలాంటి ప్రకటనే చేశారు. చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ ర్యాలీకి హాజరైన భారతీయ జనతాపార్టీ లోక్ సభ సభ్యుడు సాక్షి మహారాజ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలోని ప్రఖ్యాత జామా మసీదును కూడా ధ్వంసం చేయాలని, దాని కింద హిందూ ఆలయాలు గానీ, విగ్రహాలు గానీ లభిస్తాయని అన్నారు. అలా విగ్రహాలు లభించకపోతే తనను ఉరి తీయాలని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వెలువడిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ లో ఆదివారం ఉదయం హిందూ మహాసభ ప్రతినిధులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా సాక్షి మహరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యనాలు చేశారు. భారత్ లో ముస్లిం సామ్రాజ్యాన్ని విస్తరించిన మొఘల్ చక్రవర్తులు హిందూ ఆలయాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆలయాలను కూల్చివేసి, వాటిపై మసీదులను నిర్మించుకున్నారని, ఈ విషయం బాబ్రీ మసీదును ధ్వంసం చేయడంతో తేటతెల్లమైందని అన్నారు.
#WATCH: BJP MP Sakshi Maharaj says in Unnao "Rajneeti mein jab aaya to pehla mera statement tha Mathura mein, Ayodhya Mathura Kashi ko chhodo Dilli ki Jama Masjid todo, agar seedhion mein murtiyaan na nikle to mujhe faansi pe latka dena." (22.11.2018) pic.twitter.com/9pywDQ2flB
— ANI UP (@ANINewsUP) November 24, 2018
ఢిల్లీలోని జామా మసీదు కూడా అలాంటి నిర్మాణమేనని చెప్పారు. హస్తినను పరిపాలించిన హిందూ రాజులు నిర్మించిన ఆలయాన్ని ధ్వంసం చేసి, దానిపై మొఘల్ చక్రవర్తులు మసీదును నిర్మించారని ఆరోపించారు. 1644-1656 మధ్యకాలంలో అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ జామా మసీదును నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని, అంతకంటే ముందు అక్కడ ఆలయం ఉందనడానికి అదే స్థాయిలో చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. జామా మసీదు కింద హిందూ దేవుళ్ల విగ్రహాలు గనక లభించకపోయినా.. ఆలయం ఉన్నట్లు ఆనవాళ్లు లేకపోయినా తనను బహిరంగంగా ఉరి తీయాలని చెప్పారు. అయోధ్య ఒక్కటే కాదని, మథుర, వారణాశిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.