కేంద్రం దిద్దుబాటు: నాకే తెలియదంటున్నారు.. : పాయింట్ లాగిన జైట్లీ
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. డిమాండ్కు తగిన నగదు లేక బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. దీంతో కేంద్రం చర్యలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా నగదు బ్యాంకులకు చేర్చేందుకు పట్టే సమయాన్ని ఇరవై ఒక్క రోజుల నుంచి ఆరు రోజులకు కుదించింది. నోట్లు ముద్రణాలయం నుంచి ప్రధాన కేంద్రాలకు చేర్చేందుకు అన్ని రకాల రవాణా సాధనాలను ఉపయోగించాలని నిర్ణయించింది.
హెలికాప్టర్స్తో పాటు భారత వాయుసేనకు చెందిన విమానాలను వినియోగిస్తోంది. మరో వారం రోజుల్లో ప్రస్తుత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి కొంచెం మెరుగవడంతో గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వ వర్గాలు దృష్టిపెడుతున్నాయి.
కాగా, రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రజలందరూ స్వాగతించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. నోట్ల రద్దు ఆర్థికమంత్రి కూడా తెలియకుండా చేశారని విపక్షాలు అంటున్నాయని, అలాంటప్పుడు పార్టీ నేతలకు ఎలా తెలుస్తుందో చెప్పాలన్నారు. బీజేపీ నేతలకు, అదానీ, అంబానీలకు ముందే తెలుసునని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా ప్రతిపక్షాలు కావాలనే సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లోకి నగదును తరలించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.