Demonetisation:మూడేళ్లు గడిచాయి...కోలుకోలేని ఆర్థిక వ్యవస్థ, మోడీ నిర్ణయం సరైందేనా..?
నవంబర్ 8, 2016.. ఆ రోజు అర్థరాత్రి అయినా సరే దేశమంతా ఏటీఎంల ముందు బారులు తీరారు. దీనికి కారణం ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్లు అంటే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నోట్లు ఇకపై చెలామణిలో ఉండవని చెప్పడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ దగ్గరున్న పెద్దనోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు క్యూకట్టారు. అయితే వ్యవస్థలో మూలిగి ఉన్న నల్లధనంను బయటకు తీయాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ ప్రకటన చేయడం జరిగిందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికీ కచ్చితంగా పెద్ద నోట్లు రద్దు అయి మూడేళ్లయ్యింది. దీని ప్రభావం ఎలా ఉంది అనేదానిపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వే చేపట్టింది.
భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్న 66శాతం మంది ప్రజలు
2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో 86శాతం కరెన్సీ చెలామణిలో ఉండదనే సంకేతాలు పంపారు. ఇక ఈ ప్రకటన వెలువడి మూడేళ్లు దాటింది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దీనిపై ప్రజల అభిప్రాయంను ఆన్లైన్ సర్వే ద్వారా తీసుకుంది. ఇందులో 66శాతం మంది ఆ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. మరో 28శాతం మంది మాత్రం డీమోనెటైజేషన్ ఎలాంటి ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. మరో 33శాతం మంది మాత్రం ఆర్థికవ్యవస్థ మందగించడానికి కారణం పెద్దనోట్ల రద్దే అని అభిప్రాయపడ్డారు. డీమోనెటైజేషన్కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉన్నిందని గుర్తు చేశారు.
గత ఐదు త్రైమాసికాల్లో పెరగని జీడీపీ
ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత రెండు క్వార్టర్లలో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా తగ్గడం గమనించినట్లు సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. 2017-18 మధ్య తిరిగి కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ అది ఎంతో కాలం నిలవలేదని చెబుతున్నారు. వరుసగా గత ఐదు త్రైమాసికాలను గమనిస్తే జీడీపీ తగ్గుతూనే వచ్చింది కానీ ఎక్కడా పెరగలేదని గుర్తుచేస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ పడిపోయేందుకు ఒక్క పెద్దనోట్లు రద్దు మాత్రమే కాదని దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెబుతున్నారు.
పెద్ద నోట్ల రద్దును సమర్థించిన 42శాతం మంది
పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో పనిచేసే చాలామంది ఉద్యోగాలు పోయాయని వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంపాదన లేకుండా పోయిందని వారు అభిప్రాయపడ్డారు. పన్ను ఎగవేతదారులకు పెద్దనోట్ల రద్దు ఒక ఔషధంలా పనిచేసిందని పెద్ద నోట్ల రద్దుకు అనుకూలంగా ఓటేసిన 42శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయని చెప్పిన సర్వే... గత రెండేళ్లలో నగదు రహిత లావాదేవీలు విపరీతంగా పెరిగాయని గుర్తించింది.