బ్యాంకుల వద్ద క్యూ వెనుక.., జన్ ధన్ యోజనపై నిఘా
న్యూఢిల్లీ: ఏటీఎంలలో వినియోగదారులకు అవసరమైనంత డబ్బులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ మంగళవారం నాడు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు.
బ్యాంకుల్లో నగదు మార్పిడి చేసుకున్న వారు మళ్లీ మళ్లీ రావడంతోనే క్యూలైన్లు పెరుగుతున్నాయని చెప్పారు. నల్లధనం ఉన్నవారు సామాన్యులకు ఎరవేసి వారితో నగదు మార్పిడికి చేయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని షాకింగ్ అంశం వెల్లడించారు.
నగదు తీసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడం ద్వారా ఈ సమస్యను కొంతమేర పరిష్కరిస్తామన్నారు. జన్ ధన్ యోజన ఖాతాల్లో నల్లధనం డిపాజిట్లు జరుగుతున్నట్లు తమవద్ద సమాచారం ఉందని, దీనిపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని చెప్పారు.
సొంత డబ్బు డిపాజిట్ చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అవసరమైన నగదు ఆర్బీఐ వద్ద ఉందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్నారు. మైక్రో ఏటీఎంల ఏర్పాటుతో నగదు కొరత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఫేక్ కరెన్సీని అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలకు, పోస్టాఫీస్లకు నగదు పంపించామని తెలిపారు. నోట్ల మార్పిడి పైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో జనాలు ఉండటంతో సమయం వృథా అవుతోందన్నారు.