పెద్ద నోట్ల రద్దు: మోడీని ప్రశ్నించనున్న పీఏసీ?
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ కారణం చేత నోట్ల రద్దును చేపట్టారని తెలుసుకునేందుకు ప్రధానికి సమన్లు ఇచ్చే అవకాశాలున్నట్లు పార్లమెంటరీ కమిటీ చీఫ్ వీకే థామస్ అభిప్రాయపడ్డారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో వెల్లడించేందుకు తమను కలవాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఫైనాన్స్ సెక్రటరీ అశోక్ లావాస, ఎకనామిక ఎఫైర్ సెక్రటరీ శక్తికాంత దాస్లను ఆదివారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆదేశించింది. జనవరి 20వ తేదీలోపు నోట్ల రద్దుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది.
ఆ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కలిగిన ప్రభావాన్ని వివరించాలని స్పష్టం చేసింది. గత నవంబర్ 8న రూ.500, 1000నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే నోట్ల రద్దు అంశంపై ఎవరినైనా ప్రశ్నించే అధికారం పీఏసీకి ఉందని థామస్ తెలిపారు. కానీ, జనవరి 20న ఉర్జిత్ పటేల్ అశోక్, శక్తికాంతదాస్లతో జరిగే సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ పీఏసీ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయిస్తే.. తాము ప్రధానిని కూడా నోట్ల రద్దు అంశంపై విచారిస్తామని థామస్ తెలిపారు. అంతేగాక, ప్రధాని తన అహంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని అన్నారు.