నోట్ల రద్దు: టాటా, బిర్లాలకు ఎంత నష్టమంటే, అంబానీ సేఫ్
పెద్ద పెద్ద కంపెనీల పైన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రభావం పడింది. నోట్ల రద్దు టాటా, బిర్లాలకు భారీ షాక్ ఇచ్చింది.
ముంబై: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, ధనవంతులకు ఇబ్బందులు లేకపోయినప్పటికీ వారి పైన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రభావం పడింది. నోట్ల రద్దు టాటా, బిర్లాలకు భారీ షాక్ ఇచ్చింది.
టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ విలువ కుప్పకూలింది. దాదాపు 9 బిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. ఓ వైపు స్టాక్ మార్కెట్ భారీ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. టాటా, బిర్లా గ్రూపు కంపెనీల లాభాలు కేవలం 8 సెషన్లలో భారీగా నష్టపోయాయి.
భారీ అమ్మకాల నేపథ్యంలో దాదాపు అన్ని మేజర్ కంపెనీలు భారీగా పతనం అవుతుండగా, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మాత్రం స్వల్ప నష్టాలకే పరిమితం అయింది.
నవంబర్ 8 - 21 మధ్య కాలంలో టాటా గ్రూపులోని 27 మంది వాటాదారులకు చెందిన 39,636 కోట్లు, టీసీఎస్ రూ.21,839 కోట్లు, టాటా మోటార్స్ రూ.8,954 కోట్లు, టైటాన్ రూ.3,131 కోట్లు, టాటా స్టీల్ రూ.1,128 కోట్లు ఆవిరయ్యాయి.
బిర్లా గ్రూపుకు చెందిన అల్ట్రా టెక్ కూడా బాగా నష్టపోయింది. ఈ కంపెనీలో 62.26 శాతం వాటా కలిగి ఉన్న ప్రమోటర్లు రూ.10,678 కోట్లు నష్టపోయారు.
గ్రాసిం ఇండస్ట్రీస్ వెయ్యి కోట్లు, హిందాల్కో సుమారు రూ.800 కోట్లను కోల్పోయింది. మహేంద్ర గ్రూపు రూ.6వేల కోట్లు నష్టపోయింది. ఇక రిలయన్స్ గ్రూపు మాత్రం కేవలం 1.78 శాతం మాత్రమే నష్టపోయింది. మిగతా దిగ్గజాలతో పోలిస్తే ఆర్ఐఎల్ రూ.1,748 కోట్లను, టీవీ 18 రూ.704 కోట్ల నష్టాలతో సరిపెట్టుకుంది.