థాకరే ఉంటే నాలుక కోసేవారు: మోడీపై దుమ్మెత్తిపోసిన శివసేన
పాత నోట్ల రద్దు పైన బీజేపీ మిత్రపక్షం శివసేన నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడింది. నోట్ల రద్దు నేపథ్యంలో జనం క్యూలలో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారని, ఇదేనా దేశభక్తి అని ప్రశ్నించింది.
ముంబై: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన బీజేపీ మిత్రపక్షం శివసేన నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడింది. నోట్ల రద్దు నేపథ్యంలో జనం క్యూలలో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారని, ఇదేనా దేశభక్తి అని ప్రశ్నించింది.
బాల్ థాకరే ఉంటే నాలుకలు కోసేసేవారని తీవ్రస్థాయిలో మండిపడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష పార్టీలతో కలిసి అడుగులు వేసిన శివసేన.. గురువారం మరింత ఘాటుగా మండిపడింది.
తన నిర్ణయాలతో కేంద్రం, దేశ ప్రజలను నిస్సహాయులుగా మార్చి, ఆకలికి చచ్చేస్థితికి తీసుకువచ్చిందని, ఇది జలియన్వాలా బాగ్ ఊచకోతలకన్నా ఘోరమని అధికార పత్రిక సామ్నాలో దుమ్మెత్తి పోసింది. మోడీ ప్రభుత్వం గొప్ప విజయంగా చెప్పుకొంటున్న సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత కూడా పాక్ దాడులు కొనసాగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించింది.
నోట్లు మార్చుకోవడం కోసం ప్రజలు క్యూలలో కష్టాలు పడుతుండటాన్ని, గొప్ప దేశభక్తిగా చాటుకుంటున్నారని దుయ్యబట్టింది. ఈ సమయంలో బాలాసాహెబ్ థాకరే బతికి ఉంటే వారి నోరు మూయించేవారని, ఈ పరిస్థితిని రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకొన్న తీరుతో పోల్చి తూర్పారబట్టేవారని పేర్కొంది.
జనాన్ని నిలువునా దోచేసి, బిచ్చగాళ్లుగా రోడ్ల మీదకు నెట్టేసి, దానినే దేశభక్తిగా ప్రచారం చేసుకొంటున్నారని, జనాల నిస్సహాయతను దేశభక్తి వంటి ఉదాత్తభావనతో పోల్చడం అవమానమని, అలాంటి మాటలు మాట్లాడుతున్నవారి నాలుకలు తెగ్గోసినా తప్పు లేదని మండిపడింది. నోటు మార్పిడి సమయంలో చేతికి ఇంకు పూయడాన్ని, జాతీయ నేరంగా మండిపడింది.