'విత్ డ్రాయల్' పరిమితిని పెంచేశారు : కానీ షరతులేంటంటే..!
రద్దయిన పాతనోట్లు, చిన్ననోట్లు, కొత్త నోట్లు కలిపి బ్యాంకులో జమ చేస్తే విత్డ్రాయల్ పరిమితికి మించి అదనంగా మరికొంత సొమ్ము పొందవచ్చు.
న్యూఢిల్లీ : బ్యాంకుల్లో విత్ డ్రాయల్ పరిమితిపై ఆర్బీఐ కొత్త నిర్ణయం తీసుకుంది. పాత, కొత్త నోట్లను కలిపి డిపాజిట్ చేసేవారికి నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా డబ్బు విత్ డ్రాయల్ పరిమితిని పెంచనున్నారు. ఈ నిబంధన మంగళవారం నుంచే అమలులోకి రానుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే.. రద్దయిన పాతనోట్లు, చిన్ననోట్లు, కొత్త నోట్లు కలిపి బ్యాంకులో జమ చేస్తే విత్డ్రాయల్ పరిమితికి మించి అదనంగా మరికొంత సొమ్ము పొందవచ్చు. ఉదాహరణకు రూ.4వేల విలువ చేసే డబ్బును పాత రూ.2వేల నోట్లు, రూ.500నోట్లు, చిన్న నోట్లు రూ.100,రూ.50,రూ.20 రూ.10నోట్ల రూపేణా బ్యాంకుల్లో డిపాజిట్ చేశారనుకోండి. నిర్దేశించిన రూ.24వేల విత్ డ్రాయల్ పరిమితి కంటే అదనంగా మరో రూ.4వేలను అదనంగా పొందవచ్చు. అంటే మొత్తం రూ.28వేలను బ్యాంకు సిబ్బంధి చెల్లిస్తారు.
ఈ తరహాలో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్నవారికి తిరిగి బ్యాంకుల ద్వారా విత్ డ్రాయల్ చేసుకునేప్పుడు కొత్త రూ.2000, 500 నోట్లను చెల్లిస్తారు.
కొత్త నిర్ణయంపై ప్రజల అసంతృప్తి?
అసలే నగదు కొరతతో తీవ్ర కష్టాలు పడుతుంటే.. ఉన్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మళ్లీ విత్ డ్రాయల్ కోసం క్యూ లైన్లలో వేచియుండాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఆమాత్రం దానికి డిపాజిట్ చేయడమెందుకు? మళ్లీ లైన్లో నిలబడి విత్ డ్రాయల్ చేయడమెందుకు? అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికే ఖాతాల్లో ఉన్న డబ్బు పొందడానికే నానా కష్టాలు పడుతుంటే.. ఇప్పుడు కొత్త నోట్లను కూడా డిపాజిట్ చేసి బ్యాంకుల ఎదుట గంటల తరబడి నిలుచోవాలా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో చాలావరకు ఏటీఎంలు 'నో క్యాష్ బోర్డు'లతోనే దర్శనమిస్తున్న తరుణంలో.. చేతిలో ఉన్న డబ్బును డిపాజిట్ చేసుకుని.. బ్యాంకుల చుట్టు తిరగడం కన్నా.. ఆ డబ్బును ఖర్చు పెట్టుకున్న తర్వాత నిర్దేశించిన రూ.24వేల మొత్తాన్ని తీసుకోవడమే బెటర్ అనేది చాలామంది సామాన్యులు అభిప్రాయం.