పబ్జీ ఏ క్యాజీ: ఆన్లైన్ గేమ్ మోజులో పడి విద్యార్థి ఆత్మహత్య
ఆన్ లైన్ గేమ్స్కు పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అవిలేకుంటే జీవితం లేదనే భావనలోకి వెళ్లిపోతున్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే మొబైల్ ఫోన్లు చేతికిచ్చి తల్లిదండ్రులు కూడా తప్పుచేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. పిల్లలకు అప్పుడే మొబైల్ ఫోన్లు ఇవ్వడంతో వారు చదువులకు కూడా దూరమవుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు కొందరైతే మొబైల్ ఫోన్లకు అలవాటు పడిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
ప్రాణాలు తీసేస్తున్న ఆన్లైన్ గేమ్స్
మొన్న బ్లూవేల్ ఛాలెంజ్... నిన్న పోకెమాన్ గో... నేడు పబ్జీ... ఇవన్నీ పేరుకు ఆన్లైన్ గేమ్సే.. కాని మనుషుల ప్రాణాలు తీస్తున్న గేమ్స్ అని మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఈ మొబైల్ గేమ్స్కు అలవాటు పడి ప్రపంచాన్నే మరుస్తున్నారు.. ఆపై ప్రపంచాన్ని వీడి కానరానిలోకాలకు వెళ్లిపోతోంది యువత. ఫలితం కన్నవారికి కడుపు శోకాన్ని మిగిలిస్తోంది. ఆన్లైన్ గేమ్స్తో వచ్చేది ఏముందో తెలియదు కానీ పోయేవి మాత్రం ప్రాణాలే అని తెలుసుకోలేకపోతోంది. ఈ గేమ్స్కు అలవాటు పడిన యువత అందులో నుంచి బయటకు రాలేకపోతోంది. ఓ వైపు ఈ గేమ్స్తో చదువు అట్టెక్కి కూర్చుంటుంటే మరోవైపు బుద్ది కూడా మందగిస్తోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
పబ్జీ ఆడేందుకు ఫోను కొనివ్వలేదని ఆత్మహత్య
తాజాగా ముంబైలో ఓ 18ఏళ్ల అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణం చాలా సిల్లీ అయినప్పటికీ దీనిపై అందరూ ఆలోచించాల్సిన విషయం తలెత్తింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా..? పబ్జీ గేమ్ ఆడేందుకు మొబైల్ ఫోన్ కొనివ్వాల్సిందిగా తల్లిదండ్రులను అడిగాడు. అది కూడా రూ.37 వేలు ఖరీదు చేసే హైఎండ్ మోడల్ స్మార్ట్ ఫోను కావాలని పట్టుబట్టాడు. ఇంత ఖరీదు చేసే ఫోను ఎందుకని తల్లిదండ్రులు అడిగితే పబ్జీ ఆడేందుకు ఇదైతేనే బాగుంటుందనే సమాధానం చెప్పాడట. ఇంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు తిరస్కరించిన తల్లిదండ్రులు... అబ్బాయికి రూ.20వేలు ఇచ్చి ఫోన్ కొనుక్కోమన్నారు. తల్లిదండ్రుల మాటలకు విసిగిపోయిన కుర్రాడు మనస్తాపం చెంది తాడుతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గెలిస్తే ఏమొస్తుందో తెలియదు కానీ..ఓడితే ప్రాణాలు పోతున్నాయి
అసలు పబ్జీ గేమ్లో ఏముంది.. పిల్లలు ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నారు..? చదువులను సైతం పక్కనపెట్టేసి ఈ మాయదారి ఆటలో పడిపోయి కన్నవారికి కడుపు శోకం ఎందుకు మిగులుస్తున్నారు.. పబ్జీ అనేది ఓ ఆన్లైన్ గేమ్. ఇందులో ఓ యుద్ధభూమి ఉంటుంది. 100 మంది ఈ గేమ్ను ఒకేసారి ఆడతారు. ఒక లక్ష్యాన్ని అందుకునేందుకు 100 మంది ఒకేసారి బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎవరైతే వాటిని దాటి చివరిగా మిగులుతారో వారే విజేతలుగా నిలుస్తారు. ఇదంతా మొబైల్ వరకే పరిమితం. ఇంతటి దానికి యువత ఏకంగా ప్రాణాలే పణంగా పెడుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ క్రీడపై నిషేధం విధించాలని పలు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మాయదారి ఆటలో పడిపోయి విద్యార్థులు చదువులకు దూరం అవుతన్నారని ప్రజాసంఘాలు ఆరోపించాయి. ఈ మధ్యే పబ్జీ గేమ్ను నిషేధించాలంటూ ఓ 11 ఏళ్ల బాలుడు తన తల్లి ద్వారా ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పబ్జీ గేమ్ విద్యార్థుల పట్ల ప్రాణాంతకంగా మారుతోందని కుర్రాడు పిటిషన్లో పేర్కొంటూ వెంటనే నిషేధించాలని న్యాయస్థానాన్ని కోరాడు.