విమానంలో టాయిలెట్కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
విమానంలో తనను వాష్ రూమ్కి వెళ్లనివ్వలేదని డీజీసీఏలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు... ఏకంగా అక్కడి ఉద్యోగులనే కిడ్నాప్ చేశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని వైభవ్ చతుర్వేదిగా గుర్తించిన పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... వైభవ్ చతుర్వేది(24) జనవరి 7న వారణాసి నుంచి ఢిల్లీకి గో ఎయిర్ విమానంలో బయలుదేరాడు. విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా చతుర్వేది టాయిలెట్ వైపు వెళ్లాడు. అయితే విమాన సిబ్బంది అతన్ని అడ్డుకుని వాష్ రూమ్కి వెళ్లనివ్వలేదు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న చతుర్వేది... మరుసటి సోను అనే క్యాబ్ డ్రైవర్ని వెంట పెట్టుకుని ఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.
అయితే తాను వెళ్లేసరికి... అక్కడ ముగ్గురు,నలుగురు ఉద్యోగులు మత్తులో ఉన్నారని చతుర్వేది చెప్తున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన తాను.. డీజీసీఏ కార్యాలయంలో తనిఖీలకు వెళ్లిన సీనియర్ ఆఫీసర్గా బిల్డప్ ఇచ్చినట్లు చెప్పాడు. సురేందర్ అనే డీజీసీఏ ఉద్యోగిని బలవంతంగా క్యాబ్లో ఎక్కించుకుని సఫ్దర్గంజ్ ఆస్పత్రికి తీసుకెళ్లానని... కానీ అక్కడ అతనికి మెడికల్ చెకప్ చేసేందుకు వైద్యులు నిరాకరించారని తెలిపాడు. దీంతో సురేందర్ ఫోన్,ఐడీ కార్డును లాక్కున్నట్లు చెప్పాడు. అంతేకాదు,ఆస్పత్రికి వచ్చిన సురేందర్ సహోద్యోగి రజనీష్ ఫోన్ కూడా లాక్కున్నట్లు తెలిపాడు.
అక్కడినుంచి సురేందర్,రజనీష్ ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తానని చెప్పి... కోట్లా ప్రాంతం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. విచారణలో సీసీటీవీ ఫుటేజీ ద్వారా క్యాబ్ నంబర్ను గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు చతుర్వేదితో పాటు అతనికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ సోనును అరెస్ట్ చేశారు. డీజీసీఏ ఉద్యోగుల ఐడీ కార్డులు,సెల్ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.