వారికి షాకే: రూ. 2.5లక్షలు మించితే 200శాతం పెనాల్టీ
న్యూఢిల్లీ: మంగళవారం ఉదయం నుంచి నోట్ల మార్పిడి ప్రక్రియ మొదలైంది. అయితే, నోట్ల మార్పిడి కోసం రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయమై అందరిలోనూ కొంత ఆందోళన ఉంది. అయితే, గృహిణులు, రైతులు రూ.2.5 లక్షల వరకు పెద్ద నోట్లను డిపాజిట్ చేసినా ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టం చేశారు.
రూ.500, 1000నోట్ల మార్పిడి: మీ26 ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇవే
అలాగే ఏడాది ఆదాయం పన్ను మినహాయింపులో ఉన్న వారు కూడా భయపడాల్సిందేం లేదని చెబుతున్నారు. అయితే రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే మాత్రం 200 శాతం జరిమానా ఉంటుందని తేల్చి చెప్పింది.
'ఈ ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే అన్ని ఖాతాల డిపాజిట్ల వివరాలు తెప్పించుకుంటాం. వీటిని డిపాజిటర్లు సమర్పించిన ఆదాయ రిటర్నులతో పోల్చిచూస్తాం. తేడాలుంటే దానికి తగినట్లు చర్యలు తప్పవు' అని భారత ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ హస్ముక్ అధియా స్పష్టం చేశారు.
ఖాతాదారుడు సమర్పించిన వివరాలు సరిపోలకపోతే దాన్ని పన్ను ఎగవేతగా పరిగణిస్తారన్నారు. అప్పుడు ఆదాయపు పన్ను చట్టం 270 (ఎ) కింద 200 శాతం పెనాల్టీ విధిస్తామని ఆయన చెప్పారు. ఆభరణాలు కొనే వారు పాన్ నంబర్ను విధిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు.
కొనుగోలుదారుల నుంచి పాన్ నంబర్లు తీసుకోని నగల దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పన్ను మినహాయింపు (రూ.2.5 లక్షల) పరిమితిలో ఉన్నవారు నగదు డిపాజిట్ చేసినా భయపడాల్సిన అవసరం లేదని, అనుమానాస్పద కేసులైతే తప్ప అలాంటి వారి జోలికెళ్లమని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
'గృహిణులు రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసినా ఎలాంటి పన్ను ఉండదు. అయితే రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తేనే సమస్య ఉంటుంది' అని అన్నారు. 2-3 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసే వారి వివరాలనే పన్ను శాఖ పరిశీలిస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక పురోగతి ఉంటుందని, పన్నుల సేకరణ పెరుగుతుందని చెప్పారు. నగదు లావాదేవీల కంటే బ్యాంకు ఖాతా, చెక్, ఎలక్ట్రానిక్ చెల్లింపులను అనుసరిస్తే మేలన్నారు.