వైద్యులు షాక్: రోగి కడుపులో 140 నాణేలు, 150 మేకులు, బోల్టులు..
బటిండా: ఓ రోగి తీవ్ర కడుపునొప్పితో రావడంతో పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే అతని కడుపులో వందకుపైగా ఇనుప మేకులు, బోల్టులు, బ్యాటరీలు, నాణేలు ఉన్నాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
డెయిలీ మెయిల్ కథనంప్రకారం.. బటిండాకు చెందిన రాజ్పాల్ సింగ్(34) అనే రైతు తరచూ తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులను సంప్రదించేవాడు. ఇలా కడుపునొప్పి వచ్చినప్పుడల్లా వైద్యులు ఇచ్చిన మందులు వేసుకోవడంతో అతనికి కొంత ఉపశమనం లభించేది. ఆ తర్వాత మళ్లీ కడుపునొప్పి ప్రారంభమయ్యేది.
దీంతో అతను స్థానికంగా గ్యాస్టో ఎంటర్రాలజిస్ట్ డాక్టర్ గగన్ దీప్ గోయల్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతని కడుపుని ఎండోస్కోపీ చేసిన వైద్యుడు షాక్కు గురయ్యాడు. అతని కడుపులో 140 నాణేలు, 150 మేకులు, బోల్టులు, బ్యాటరీలు గుర్తించారు వైద్యులు.
ఇవన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయని రోగిని ప్రశ్నించగా.. మానసిక ఒత్తిడి కారణంగా మూడేళ్ల క్రితం చనిపోదామని భావించి ఇనుప వస్తువులు మింగాట. అప్పటి నుంచి ఇనుప వస్తువులు మింగకపోతే వెలితిగా ఉండేదని, నేరుగా మింగడం కష్టంగా అనిపించడంతో వాటిని పాలతో, పండ్ల రసాలతో కలిపి మింగేవాడినని చెప్పాడు.
ఈ విషయం తను ముందు చూపించుకున్న వైద్యులకు తెలుపకోవడంతో మామూలు నొప్పి అనుకుని మందులు ఇచ్చేవారు. అయితే ఇనుప సామాను సంగతి ఎండోస్కోపీ ద్వారా బయటపడింది. దీంతో అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు 140 నాణేలు, 150 మేకులు బయటికి తీశారు. ఇంకా కొన్ని ఇనుప సామాన్లు కడుపులోనే ఉన్నాయని, వాటిని తీయాలంటే మరో ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అతను కోలుకున్నాక మరో ఆపరేషన్ ద్వారా వాటిని కూడా తీస్తామని చెప్పారు.