చెన్నైకి ముప్పు?: బంగాళాఖాతంలో వాయుగుండం
చెన్నై: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడు రాజధాని చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.
నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరో 48 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, కేరళలో సోమవారం నుంచే ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. అయితే వాతావరణ శాఖ మందస్తు హెచ్చరికలతో చెన్నైలోని అధికారులు అప్రమత్తమయ్యారు. మృత్యకారులు వేటకు వెళ్లవద్దంటూ డీసీ-1 హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
మరోవైపు వాయుగుండం కారణంగా తమిళనాడుతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.