కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పదవి లేదు, హైకమాండ్ నిర్ణయం, సీనియర్లకు చెక్, శ్రీరాములు!
బెంగళూరు: కర్ణాటకలో బీఎస్. యడియూరప్ప మంత్రివర్గం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ? అనే చర్చ జరుగుతోంది. యడియూరప్ప ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి వస్తోంది అని బీజేపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ ఉప ముఖ్యమంత్రి పదవులకు చెక్ పెట్టి ఆ పదవి ఆశిస్తున్న వారి ఆశల మీద నీళ్లు చల్లింది. కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ? ఆ అవసరం ఉందా ? అని హైకమాండ్ ప్రశ్నించిందని తెలిసింది.
రెండు విడతల్లో మంత్రివర్గం
కర్ణాటకలో రెండు విడతల్లో మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యాలని హైకమాండ్ నిర్ణయించింది. మొదటి విడతలో 10 మంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. అనర్హతవేటుకు గురైన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న తరువాత రెండో విడత మంత్రివర్గం ఏర్పాటు చెయ్యాలని హైకమాండ్ నిర్ణయించింది.
సీఎం చర్చలు
ఆగస్టు 4వ తేదీ లోపు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప జిల్లాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, సీఇవోలతో చర్చించనున్నారు. ఆగస్టు 5వ తేదీ ఢిల్లీ వెలుతున్న సీఎం యడియూరప్ప హైకమాండ్ తో చర్చించి మంత్రి పదవులు ఎవ్వరికి ఇవ్వాలి అనే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.
శ్రీరాములు ఆశలు ?
ఉప ముఖ్యమంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో కేఎస్. ఈశ్వరప్ప, బళ్లారి శ్రీరాములు, ఆర్. అశోక్ ముందు వరుసలో ఉన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీరాములుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని గత ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. శ్రీరాములుకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆయన వర్గీయులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే శ్రీరాములు వర్గీయులకు నిరాశ ఎదురైయ్యింది.
గతంలో ఉప ముఖ్యమంత్రులు
కర్ణాటకలో గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రుల పదవులు ఉన్నాయి. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్ అశోక్ లు ఉప ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ కులాల సమీకరణాలతో సీనియర్ ఎమ్మెల్యేలను ఉప ముఖ్యమంత్రులు చేస్తారని అనుకుంటున్న సమయంలో హైకమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యేలకు అనుమానం !
ఆరు సంవత్సరాల తరువాత బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోని చాల మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉప ముఖ్యమంత్రి పదవులకు అవకాశం ఇవ్వకూడదని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడంతో సీనియర్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు అధిక ప్రధాన్యత ఇస్తే మాకు మంత్రి పదవులు వస్తాయా ? అని చాల మంది బీజేపీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.