డేరా బాబా కేసు: అసలు కోర్టు రూమ్లో ఏం జరిగిందంటే..?, బాబా రాందేవ్ స్పందన!
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ అత్యాచార కేసులో తీర్పు ఇవ్వాల్సిన జడ్జి జగ్దీప్సింగ్ సోమవారం రోహ్తక్ జైలుకు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ మొదలుకా
రోహ్తక్: రేపిస్ట్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. రేప్ కేసులో గుర్మీత్ను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. సోమవారం రోహ్తక్ జైల్లోనే ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేసి శిక్ష విధించింది.
ఈ సందర్భంగా.. తప్పయిపోయిందని, కరుణించాలని డేరా బాబా చేతులు కట్టుకొని వేడుకున్నా న్యాయమూర్తి మాత్రం కరుణించలేదు. అంతకుముందు జడ్జి జగ్దీప్సింగ్ ప్రత్యేక హెలికాప్టర్లో జైలుకు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ మొదలుపెట్టారు.
ఇరు వర్గాలు వాదనలు వినిపించడానికి చెరో పది నిమిషాలు కేటాయించారు. గుర్మీత్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడని, సాధ్యమైనంత తక్కువ శిక్ష వేయాలని డిఫెన్స్ లాయర్లు జడ్జిని కోరారు.
అయితే సీబీఐ మాత్రం అత్యాచారానికి గరిష్ఠ శిక్ష అయిన జీవిత ఖైదు విధించాలని కోరింది. తనను నమ్మిన భక్తులను మోసం చేశాడని సీబీఐ వాదించింది. మరో 45 మంది మహిళలు కూడా తమను గుర్మీత్ రేప్ చేశాడని చెబుతున్నా.. బయటకు రావడం లేదని సీబీఐ స్పష్టంచేసింది. ఒక్కసారి కాదు మూడేళ్ల కాలంలో వేర్వేరు ప్రదేశాల్లో ఎన్నోసార్లు తన భక్తులపై గుర్మీత్ అత్యాచారానికి పాల్పడ్డాడని సీబీఐ ఆరోపించింది.
అయితే ఢిపెన్స్ లయార్లు మాత్రం.. గుర్మీత్ పై ఇన్ని ఆరోపణలు ఉన్నా.. సమాజంలో ఆయనకి ఉన్న పేరు ప్రతిష్టల దృష్ట్యా అయినా శిక్ష తగ్గించాలని కోరారు. అయితే ఇప్పటికే రెండు రేప్ కేసుల్లో గుర్మీత్ దోషి అని తేలడంతో.. ఆయన ఏ తప్పూ చేయలేదని మాత్రం డిఫెన్స్ లాయర్లు వాదించలేదు.
గతంలో ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు కాబట్టి శిక్ష తగ్గించాలని మాత్రం కోరారు. సెక్షన్ 376 కింద అత్యాచార నేరానికి కనీసం ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదు (14 ఏళ్లు) విధిస్తారు. జడ్జిమెంట్ వినగానే గుర్మీత్ జడ్జి ముందు ప్రాధేయపడ్డాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. దయ చూపాలని వేడుకున్నాడు. తక్కువ శిక్షతో వదిలేయాలని కోరాడు.
''చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని కోర్టు నిరూపించింది..''
రేప్ కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు ప్రత్యేక సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంపై బాబా రాందేవ్ స్పందించారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని కోర్టు నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు పంజాబ్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. బర్నాలాలో భారీ సంఖ్యలో భద్రదతా దళాలు పహారా కాస్తున్నాయి. గుర్మీత్కు శిక్షను ఖరారు చేసిన తర్వాత పెద్ద ఎత్తున్న అల్లర్లు జరిగే అవకాశం ఉన్న కారణంగా కట్టుదిట్టమైన భద్రతను పెంచారు.