జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన డేరాబాబా
కొన్ని నెలలుగా సైలెంట్గా సాగిన డేరాబాబా కేసు విచారణలో ముందడుగు పడింది. 2002లో ఓ జర్నలిస్టు హత్యకు సంబంధించినే కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబాను దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి రామ్ రహీమ్తో పాటు మరో ముగ్గురిని దోషులుగా ప్రకటించింది పంచకులా లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.ఇక డేరాబాబాకు ఎలాంటి శిక్ష విధించాలనేదానిపై జనవరి 17న వెల్లడించనుంది సీబీఐ కోర్టు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డేరాబాబాను సీబీఐ కోర్టు విచారణ చేసింది.
2002 అక్టోబర్ 24న ఛత్రపతి అనే జర్నలిస్టును అతని నివాసంలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. డేరాబాబా ఆశ్రమంలో అమ్మాయిలను ఎలా లోబర్చుకుని వారిని లైంగికంగా వేధించి ఆపై డేరాబాబా అత్యాచారం చేసేవాడో తన పూసగుచ్చినట్లు పత్రిక 'పూరా సచ్' ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. దీంతో డేరా బాబా మనుషులు ఛత్రపతిని తన ఇంట్లో తుపాకీతో కాల్చారు. మూడువారాల పాటు చికిత్స పొందిన అనంతరం ఛత్రపతి మృతి చెందాడు.
సీబీఐ చార్జ్ షీటు ప్రకారం డేరా మేనేజర్ కృష్ణలాల్ డేరాబాబాకు చెందిన లైసెన్సు రివాల్వర్, వాకీటాకీలను ఇద్దరి షూటర్లకు ఇచ్చినట్లు ఉంది. కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్ అనే వ్యక్తులకు ఇచ్చి చత్రపతిని చంపాల్సిందిగా పురమాయించినట్లు సీబీఐ చార్జ్షీటులో పేర్కొంది. ప్రస్తుతం డేరా బాబా అంతకు ముందు కేసులో విధించిన 20 ఏళ్లు జైలు శిక్ష రోహతక్ లోని సునారియా జైలులో అనుభవిస్తున్నాడు. తీర్పు రావడంతో హర్యానాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆగష్టు 2017లో డేరాబాబా నేరస్తుడని కోర్టు తీర్పు చెప్పడంతో పంజాబ్, హర్యానాలో పలుచోట్ల హింస చెలరేగింది. ఆ హింసలో దాదాపు 40 మంది చనిపోగా చాలా మంది గాయాలపాలయ్యారు.