ఇదీ డొల్ల కంపెనీల గుట్టు: నోట్ల రద్దు సమయంలో వేల కోట్ల లావాదేవీలు.. కూపీ లాగుతోన్న ప్రభుత్వం..
న్యూఢిల్లీ: గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు సమయంలో డీరిజిస్టర్ కంపెనీల నుంచి దాదాపు రూ.21వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు భారత ప్రభుత్వం గుర్తించింది.
డొల్ల కంపెనీలు:
డొల్ల కంపెనీల గుట్టు రట్టు చేసేందుకు నోట్ల రద్దు సమయంలో అధిక మొత్తంలో లావాదేవీలు జరిపిన కంపెనీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ క్రమంలో దాదాపు 62,300 కంపెనీలు 88వేల బ్యాంకు ఖాతాల ద్వారా తమ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు వెల్లడైంది.
మరో 1.6లక్షల కంపెనీలపై ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ చేసింది. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను సేకరించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సంబంధిత అధికారి తెలిపారు.
నిరాకరిస్తే చర్యలే
ఒకవేళ డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తే.. వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.
కాగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాల నుంచి సేకరించిన సమాచారంతో కేంద్రం డొల్ల కంపెనీల జాబితా తయారుచేసింది.
నేరం రుజువైతే?
భవిష్యత్తులో ఈ డొల్ల కంపెనీలు ఎటువంటి లావాదేవీలు జరపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు రుజువైతే.. సంస్థ డైరెక్టర్లకు, ఛైర్మన్లకు పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ కింద వీరిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే దాదాపు 3లక్షల కంపెనీల డైరెక్టర్లను ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రూ.4574కోట్ల లావాదేవీలు:
పెద్ద నోట్ల రద్దు సమయంలో అధిక మొత్తంలో నగదు డిపాజిట్ చేసినవారికి సంబంధించిన వివరాలను 13బ్యాంకులు అందజేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో దాదాపు 5800 అనుమానాస్పద కంపెనీల నుంచి అధికమొత్తంలో డిపాజిట్లు చేయడాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు.
ఈ బ్యాంకులకు చెందిన 13,410బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.4574కోట్లు డిపాజిట్ అయినట్లు సమాచారం.అందులో నుంచి రూ.4552కోట్లను ఆ వెంటనే విత్ డ్రా చేసినట్లు కేంద్రం తెలిపింది.