సరిహద్దులో ఢీ అంటే ఢీ... అయినా చైనాతో సంబంధాలు చెడలేదు... లోక్సభలో కీలక ప్రకటన...
సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు... యుద్దానికి సిద్దమని భారత్ ప్రకటనలు... అసలు గాల్వన్ వ్యాలీలో ఏం జరుగుతుందో చెప్పాలన్న విపక్షాల డిమాండ్... వెరసి భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ మంగళవారం(సెప్టెంబర్ 15) సభకు వివరించిన తెలిసిందే. తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత్-చైనా సంబంధాలపై లోక్సభకు ఓ లిఖితపూర్వ లేఖ సమర్పించింది.
తృణమూల్ ఎంపీ ఆరా...
ఇప్పటికైతే భారత్-చైనా మధ్య సంబంధాలు అంతగా ఏమీ దిగజారలేదని లోక్సభకు సమర్పించిన లేఖలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఓవైపు వాస్తవాధీన రేఖ వెంబడి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో తెలియని పరిస్థితుల్లో... ఇటీవల పాంగాంగ్ త్సో దక్షిణ తీరాన్ని ఆక్రమించేందుకు చైనా విఫలయత్నం చేసిన నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల శాఖ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సరిహద్దులో ఢీ అంటే ఢీ..
సరిహద్దులో చోటు చేసుకునే ఏ చర్య అయినా ఇరు దేశాల సంబంధాల మధ్య ప్రభావం చూపిస్తుందని రాజ్నాథ్ మంగళవారం లోక్సభలో వ్యాఖ్యానించారు. తూర్పు లదాఖ్లోని గోగ్రా,కొంగ్కా లా,పాంగాంగ్ దక్షిణ తీరం,పాంగాంగ్ ఉత్తర తీరం వెంబడి చైనా తమ బలగాలను పెద్ద ఎత్తున మోహరించిందన్నారు.ఇందుకు ధీటుగా భారత్ కూడా భారీగా బలగాలను మోహరించినట్లు తెలిపారు. మొత్తం మీద సరిహద్దులో ఢీ అంటే ఢీ తరహా వాతావరణం నెలకొన్నా... అవేవీ ఇరు దేశాల సంబంధాలను అంతగా దిగజార్చలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొనడం గమనార్హం.
యుద్దానికి సిద్దమని ప్రకటన...
ప్రస్తుతం పాంగాంగ్ త్సో సరస్సు దక్షిణ,ఉత్తర తీరాల్లో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అయితే పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 4 వద్ద చైనా దళాల కన్నా భారతే మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ, కీలక పర్వత ప్రాంతాలు భారత్ స్వాధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్వాధీనంలో ఉన్న దక్షిణ తీరంలోని పర్వతాలను ఆక్రమించుకునేందుకు చైనా తరుచూ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో పూర్తి స్థాయి యుద్దానికి రెడీ అని తాజాగా భారత సైన్యం ప్రకటించడం.. మున్ముందు సరిహద్దులో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రెట్టింపు చేసింది.