రాహుల్కు షాక్: సూరత్, వడోదర, అహ్మదాబాద్ల్లో బిజెపిదే హవా, నో జీఎస్టీ ఎఫెక్ట్
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి జీఎస్టీ, నోట్లరద్దు వంటి నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ, వ్యాపారులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బిజెపి విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ స్థానాల్లో విజయంపై ఆశలు పెట్టుకొన్నా సక్సెస్ కాలేదు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ ఓట్లను సాధించగలిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్ పార్టీ నిలువరించగలిగితే బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ధారపోసింది. రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. అయితే రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ రాష్ట్రంలో రాహుల్ ప్రచారంలో కీలకంగా వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ నేతల్లో కొంత అసంతృప్తి లేకపోలేదనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.
జీఎస్టీ ఎఫెక్ట్ కన్పించలేదు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జీఎస్టీ ఎఫెక్ట్, నోట్ల రద్దు వంటి నిర్ణయాల ఫ్రభావం కన్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహూల్గాంధీ జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ప్రచారం చేశారు. అయితే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని వస్తువులపై జీఎస్టీ స్లాబ్ను మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో ఈ జీఎస్టీ ఎఫెక్ట్ గుజరాత్ ఎన్నికల్లో కన్పించలేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
బిజెపికి పట్టం కట్టిన వ్యాపారులు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఆగ్రహంగా ఉన్న వ్యాపార వర్గాలు బీజేపీకి షాక్ ఇస్తారనుకుంటే సూరత్ వంటి ప్రధాన ట్రేడ్ సెంటర్లలోనూ బీజేపీ వ్యతిరేకపవనాలు వీచిన దాఖలాలు లేవు. సూరత్ జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూరత్ ఈస్ట్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం కనబరిచింది.
సౌరాష్ట్రలో కూడ బిజెపికి అనుకూల ఫలితాలు
సౌరాష్ట్ర మినహా గుజరాత్లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటింది. దక్షిణ, మధ్య గుజరాత్ ప్రాంతాల్లో తన పట్టు నిలుపుకుంది. వాణిజ్య వర్గాలు ప్రబలంగా ఉండే సూరత్, అహ్మదాబాద్, వడోదరల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి.
కాంగ్రెస్ అంచనాలు తారుమారు
జీఎస్టీ, నోట్ల రద్దుతో ముప్పతిప్పలు పడ్డ గుజరాత్ వ్యాపారులు మూకుమ్మడిగా బీజేపీకి షాక్ ఇస్తారని వెలువడ్డ అంచనాలు తారుమారయ్యాయి. రాహుల్ సైతం వ్యాపారుల్లో ఉన్న అసంతృప్తితో లబ్ధి పొందాలని జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా అభివర్ణిస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. కానీ, వ్యాపారులు గణనీయంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ప్రయోజనం దక్కలేదు. బిజెపికే ఓటర్లు పట్టం కట్టారు.