అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ... క్షిపణి వ్యవస్థను ఆదేశం నుంచే కొనుగోలుకు భారత్ మొగ్గు
న్యూఢిల్లీ: రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందానికే భారత్ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది . రక్షణ పరంగా రష్యా నుంచి ఎస్-400 ట్రైంఫ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు నిర్థారించుకుంది. రష్యా నుంచి రక్షణ వ్యవస్థలు కొనరాదని అవన్నీ అమెరికా నుంచి కొనుగోలు చేయాలని భారత్పై అగ్రరాజ్యం తీసుకొచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం లొంగలేదు. అంతేకాదు డ్రోన్లు, ఇతర యుద్ధ విమానాలను సమకూరుస్తామని అమెరికా చెప్పినప్పటికీ భారత్ మాత్రం రష్యా క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపింది.
ఇక భారత్కు ఆయుధాలతో కూడిన డ్రోన్లను విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ శనివారం ఆమోదం తెలిపింది.అమెరికా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ భారత్ రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు అడుగులు ముందుకు వేస్తోందని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను ఈ మిస్సైల్ వ్యవస్థ కూల్చదని ఆయన చెప్పారు. ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు రష్యాతో గతేడాది అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇక త్వరలోనే భారత అమ్ముల పొదిలో ఎస్-400 రక్షణ వ్యవస్థ చేరుతుందని తెలిపారు. అయితే ఒప్పందం నుంచి భారత్ వెనక్కు తగ్గుతుందా అన్న ప్రశ్నకు చాలా కాంట్రాక్టులు రద్దు అవుతుంటాయని అది సహజమే అని చెప్పిన అధికారి...రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం మాత్రం రద్దు కావడం లేదని స్పష్టం చేశారు.ఇక రష్యా నుంచి ఒక్క యుద్ధ విమానాలు, లేదా క్షిపణి వ్యవస్థను మాత్రమే కొనుగోలు చేయడం లేదని ఈ కాంట్రాక్టు ద్వారా ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని అధికారి ఒకరు తెలిపారు. అదేసమయంలో అణు జలాంతర్గామి విషయంలో కూడా రష్యా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఒకవేళ ఈ ఒప్పందాన్ని కనుక రద్దు చేసుకున్నట్లయితే బంధాలు తెగిపోవడమే కాకుండా చమురు బిజినెస్లో కూడా ఆ ప్రభావం పడుతుందని తెలిపారు. మరోవైపు టర్కీ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని కూడా భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. టర్కీ కూడా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్వవస్థను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే టర్కీకి ఈ విషయంలో అమెరికా అల్టిమేటం జారీ చేసింది. రష్యాతో రక్షణ సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై కాట్సా కింద ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వరని భారత్కు ముందే తెలుసు.
ఇదిలా ఉంటే రష్యాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అమెరికా థాడ్ ఎఫ్ -35 యుద్ద విమానాలు భారత్ కు సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. అయితే అమెరికా భారత్కు ఎలాంటి ఆఫర్ ప్రకటించలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. అంతేకాదు భారత్ కూడా ఈ తరహా యుద్ధ విమానాలపై ఆసక్తి చూపలేదని స్పష్టం చేసింది. ఈ యుద్ధ విమానాలు రాఫెల్ యుద్ధ విమానాల ధర కంటే కాస్త తక్కువే.