తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు, సమైక్యానికే: దేవెగౌడ
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ను విభజించేలా పార్లమెంటులో బిల్లు వస్తే సమైక్యాంధ్రకే మద్దతు ఇస్తానని మాజీ ప్రధాని, జెడిఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచేందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని దేవెగౌడను కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం సమైక్యాంధ్ర జెఎసి నాయకులు కలిశారు. కుప్పం నుంచి సుమారు 30 మంది వివిధ శాఖల ఉద్యోగులు, పలు సంఘాల ప్రతినిధులు శుక్రవారం బెంగళూరుకు వచ్చారు.
జేడీఎస్ జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దేవెగౌడను వారు ప్రత్యేకంగా కలిశారు. రాష్ట్రం విడిపోతే వెనుకబడిన రాయలసీమ ప్రాంతం మరింత అధ్వానంగా మారుతుందని, జల వనరులకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని జేఏసీ నాయకులు దేవెగౌడకు వివరించారు.
70 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నా కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వారు వివరించారు. ఇందుకు స్పందించిన దేవెగౌడ కాంగ్రెస్ అధిష్ఠానం తీరు సరిగా లేదని, నాటకాలు ఆడేలా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమైక్యానికి మద్దతుగా పార్లమెంటులో ప్రస్తావిస్తానని వారికి హామీ ఇచ్చారు. జేఏసీ నాయకులు జగదీశ్ బాబుతో సహా పలువురు పాల్గొన్నారు.